
విద్యాశాఖ మంత్రి రాకకు ఏర్పాట్ల పరిశీలన
పార్వతీపురం టౌన్: రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనకు సోమవారం రానున్న దృష్ట్యా మంత్రి గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, కలెక్టర్ శ్యామ్ప్రసాద్, ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పార్వతీపురం సబ్కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఏఎస్పీ అంకిత సురానా ఏర్పాట్లను పరిశీలించారు.
పార్వతీపురం పట్టణంలో పదవ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సత్కార కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడే కార్యక్రమాన్ని స్థానిక రాయల్ కన్వెన్షన్లో ఏర్పాటు చేయగా వసతులను వారు పరిశీలించారు. ఏర్పాట్లు పక్కాగా చేయాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణిి అధికారులను ఆదేశించారు. అనంతరం చినబొండపల్లిలో జరిగే కార్యక్రమం ఏర్పాట్లను తనిఖీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ తేజేశ్వరరావు, జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి బి.చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.