సేదదీరుతూ అనంతలోకాలకు..! | - | Sakshi
Sakshi News home page

సేదదీరుతూ అనంతలోకాలకు..!

Jun 8 2025 12:31 AM | Updated on Jun 8 2025 12:31 AM

సేదదీ

సేదదీరుతూ అనంతలోకాలకు..!

పెందుర్తి: ఓ నిర్మాణ కూలీ జీవితం నిద్రలోనే కడతేరింది. తాను పనిచేస్తున్న చోటే సేద తీరుతుండగా విధి చిన్నచూపు చూడడంతో ఊపిరాడక అసువులు బాశాడు. పెందుర్తి మండలం ముదపాకలోని జగనన్న కాలనీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పెందుర్తి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా తెర్లాం మండలం నందబలగ గ్రామానికి చెందిన పక్కి సూరన్నదొర (57), గంగమ్మ దంపతులు కుటుంబంతో కలిసి ముదపాకకు వలస వచ్చి ఇక్కడి జగనన్న కాలనీలో నిర్మాణ పనులు చేస్తుంటారు. సూరన్నదొర అన్న కుమారుడు పక్కి ప్రసాద్‌ ఈ నెల 4న ఇదే ప్రాంతంలో బావిలో పడి మృతి చెందాడు. ఈ క్రమంలో ప్రసాద్‌ మృతదేహం పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు వెళ్లిన సూరన్న.. నీరసంగా ఉండడంతో ముదపాకలోని ఇంటికి తిరిగి వచ్చేశాడు. తీవ్ర విషాదంలో ఉన్న సూరన్న ముదపాకలోనే ఉన్న బంధువులతో అదే రోజు సాయంత్రం మద్యం తాగాడు. ఉదయం మళ్లీ కేజీహెచ్‌కు వెళ్లి మృతదేహంతో ఊరికి వెళ్తానని చెప్పాడు. అనంతరం సమీపంలో నిర్మాణం కోసం పోసి ఉన్న నల్ల పిక్క రాశిపై పడుకున్నాడు. అయితే అర్ధరాత్రి అక్కడికి పిక్క వేసేందుకు వచ్చిన లారీ డ్రైవర్‌ సూరన్న నిద్రిస్తున్న విషయాన్ని గమనించకుండా అతనిపైనే అన్‌లోడ్‌ చేసేశాడు. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న సూరన్నదొర ఊపిరాడక మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

మూడు రోజుల తర్వాత వెలుగులోకి...

కేజీహెచ్‌కు వెళ్తానని చెప్పిన సూరన్న కనిపించకపోవడంతో విజయనగరం వెళ్లిపోయాడని అందరూ భావించారు. కానీ అతను అక్కడికి కూడా రాకపోవడంతో కుటుంబసభ్యులు ప్రసాద్‌ అంత్యక్రియలు నిర్వహించకుండా చాలాసేపు ఎదురుచూశారు. చివరకు ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్న కుటుంబ సభ్యులు గురువారం తిరిగి ఇక్కడికి వచ్చి సూరన్న ఆచూకీ కోసం ఆరా తీశారు. ఈ క్రమంలో అతను అదృశ్యమైనట్లు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేద్దామని నిర్ణయించుకున్నారు. అయితే శనివారం ఉదయం కాలనీలో నిర్మాణ పనుల కోసం నల్ల పిక్కను తరలించేందుకు పొక్లెయిన్‌తో లారీలకు లోడ్‌ చేస్తున్నారు. ఆ సమయంలో నల్ల పిక్క రాశి నుంచి ఓ చేయి బయటకు కనిపించడం, ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దుర్వాసన రావడంతో ఆందోళనకు గురైన పొక్లెయిన్‌ ఆపరేటర్‌ విషయాన్ని కాలనీవాసులకు, గ్రామస్తులకు తెలిపాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయగా, అది సూరన్నదొరదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. ప్రాథమిక విచారణ చేపట్టిన సీఐ కె.వి.సతీష్‌కుమార్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడాది కిందట రైలు ప్రమాదంలో సూరన్న కుమారుడు, మూడు రోజుల కిందట ప్రమాదవశాత్తు బావిలో పడి అతని అన్న కుమారుడు మృతి చెందడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబంలో.. ఈ తాజా విషాదం తో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

నిద్రపోతున్న కూలీని గమనించని లారీ డ్రైవర్‌

నల్ల పిక్కలో కూరుకుపోయి కూలీ దుర్మరణం

మూడు రోజుల తర్వాత వెలుగుచూసిన విషాద ఘటన

సేదదీరుతూ అనంతలోకాలకు..!1
1/2

సేదదీరుతూ అనంతలోకాలకు..!

సేదదీరుతూ అనంతలోకాలకు..!2
2/2

సేదదీరుతూ అనంతలోకాలకు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement