
జూలై 9, 10 తేదీల్లో గిరి ప్రదక్షిణ
విశాఖ సిటీ: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి గిరి ప్రదక్షిణ జూలై 9, 10 తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా చూడాలని సూచించారు. భక్తులు జాతీయ రహదారిని దాటే చోట తాత్కాలిక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్, సీపీ శంఖబ్రత బాగ్చి అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి ఎన్హెచ్ఏఐ అధికారులను సమన్వయం చేసుకొని చర్యలు చేపట్టాలని చెప్పారు. తొలి పావంచా వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు పోలీస్ బందోబస్తు, పోలీస్ శిబిరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని చెప్పారు. క్యూలైన్లు, రద్దీ ప్రదేశాల వద్ద గట్టి బందోబస్తు కల్పించాలన్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తాగునీరు, మరుగుదొడ్లు, రద్దీ ప్రదేశాల్లో లైటింగ్ ఏర్పాట్లు చేయాలని, ముందుగానే పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంబులెన్సులు, వైద్య శిబిరాలు సిద్ధం చేయాలని వైద్యాధికారులకు సూచించారు. అప్పుఘర్ వద్ద భక్తులు సముద్ర స్నానాలు చేసే సమయంలో మైక్ ద్వారా జాగ్రత్తలు చెప్పాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. కొండపై అగ్నిమాపక యంత్రం, ఫైర్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఉదయం నుంచి దర్శనాలు : ప్రధాన అర్చకుడు వైదిక కార్యక్రమాల షెడ్యూల్ను వివరించారు. జూలై 9వ తేదీ ఉదయం నుంచి దర్శనాలు మొదలవుతాయని, ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రచార రథయాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. తొలి పావంచా వద్ద కొబ్బరి కాయ కొట్టడం ద్వారా 32 కి.మీ మేర గిరి ప్రదక్షిణ మొదలవుతుందని పేర్కొన్నారు. 10వ తేదీ సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగుతాయని, ఆ రోజే స్వామికి నాలుగో విడత చందన సమర్పణ జరుగుతుందని తెలిపారు.
యంత్రాంగం సహకారంతో ఏర్పాట్లు
ఆలయ ఈవో త్రినాథరావు మాట్లాడుతూ యంత్రాంగం సహకారంతో కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం తరఫున చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గుర్తించిన 28 ప్రదేశాల్లో 290 తాత్కాలిక టాయిలెట్లు, 129 శాశ్వత టాయిలెట్లు, జీవీఎంసీ ఆధ్వర్యంలో మరో 29 శాశ్వత టాయిలెట్లు, 31 వైద్య శిబిరాలు, 6 ప్రధాన ప్రాంతాల్లో పబ్లిక్ అడ్రస్ సిస్ట్ం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కొండపైన 170, దిగువన 58 సీసీ కెమెరాలు ఉన్నాయని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరిన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తొలి పావంచా వద్ద అవసరానికి తగిన విధంగా కొబ్బరి కాయలు కొట్టేందుకు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమావేశంలో డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డీఆర్వో బి.హెచ్.భవానీ శంకర్, ఆర్డీవో సంగీత్ మాథుర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ హరేందిర ప్రసాద్