
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి
కలెక్టర్ హరేందిర ప్రసాద్ పిలుపు
ఏయూక్యాంపస్: పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం ఆర్.కె.బీచ్ నుంచి ఏయూ కన్వెన్షన్ సెంటర్ వరకు నిర్వహించిన గ్రీన్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, జీవీఎంసీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 5 లక్షల మొక్కలను నాటే కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మిలియన్ కంటే ఎక్కువ మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత కూడా చేపట్టాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని, దానికి బదులుగా వస్త్ర, నార సంచులను వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారని హెచ్చరించారు. జీవీఎంసీ పరిధిలో 6 వేల మంది పారిశుధ్య సిబ్బంది నిరంతరం నగర పరిశుభ్రతకు కృషి చేస్తున్నారన్నారు. ప్రజలే ప్లాస్టిక్ను నిషేధిస్తే దాని డిమాండ్ తగ్గి ఉత్పత్తి కూడా తగ్గుముఖం పడుతుందని అభిప్రాయపడ్డారు. మొక్కలు నాటడంలో భాగస్వాములైన దివీస్, లారా, కోరమండల్, మాట్రిక్స్, అలోవెరా వంటి పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యాన్ని కలెక్టర్ అభినందించారు. గ్రీన్ ర్యాలీకి ముందు పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఏయూ కన్వెన్షన్ సెంటర్ వద్ద మొక్క నాటారు. కార్యక్రమంలో డీఎఫ్వో, జూ క్యూరేటర్ మంగమ్మ, కాలుష్య నియంత్రణ మండలి, జీవీఎంసీ, అటవీశాఖ, పోలీసులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజలకు పర్యావరణ చైతన్యం పెంపొందిస్తూ కళాకారులు గీతాలను ఆలపించారు.

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి