
కోడి వ్యర్థాల అక్రమ రవాణాపై విచారణ డిమాండ్
డాబాగార్డెన్స్: నగరంలో కోడి వ్యర్థాల సేకరణ, రవాణాలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి, ప్రమాదకరమైన చీకటి వ్యాపారంపై విచారణ చేపట్టాలని కోరుతూ జీవీఎంసీ సీపీఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి.గంగారావు, కూటమి కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సోమవారం జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మేయర్కు పీలా శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ఈ వ్యవహారంపై విచారణకు ఫ్లోర్ లీడర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని డాక్టర్ బి.గంగారావు డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా నగరంలో కోడి వ్యర్థాల సేకరణ, రవాణాలో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా తీవ్ర అనైతిక, ప్రమాదకర అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం వ్యర్థాలను కాపులుప్పాడ డంపింగ్ యార్డ్కు తరలించకుండా, అక్రమంగా చేపల చెరువులకు తరలించి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యర్థాలను వినియోగించిన చేపల చెరువుల్లోని చేపలను తిన్న ప్రజలు ప్రమాదకరమైన వ్యాధులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అనైతిక కుంభకోణంలో అధికార కూటమికి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని,ఈ చీకటి కార్యకలాపాలను అరికట్టాల్సిన ప్రజాప్రతినిధులే బినామీలుగా వ్యవహరించడం నేరమని వారు తీవ్రంగా విమర్శించారు. కోడి వ్యర్థాల అక్రమాలు, అవినీతిపై విచారణకు కౌన్సిల్లోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలనిడిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రికి లేఖలుఇదే అంశంపై కూటమి జనసేన కార్పొరేటర్ కూడా కలెక్టర్, జీవీఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ హరేందిర ప్రసాద్, నగర మేయర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్య మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, సీడీఎంఏ కమిషనర్లకు లేఖలు పంపారు.
57 ఫిర్యాదుల స్వీకరణ
సోమవారం జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 57 వినతులు అందాయి. వీటిలో నగరంలో జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలు, నియమ నిబంధనలకు వ్యతిరేకంగా సాగుతున్న నిర్మాణాలపై అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, డీసీఆర్ శ్రీనివాసరావుతో పాల్గొన్నారు.
మేయర్కు వినతిపత్రాలు అందజేసిన సీపీఎం ఫ్లోర్ లీడర్ గంగారావు, కార్పొరేటర్ మూర్తి యాదవ్