
రెండో రోజూ అవే అవస్థలు
● కొనసాగుతున్న రేషన్ కష్టాలు ● సర్వర్ డౌన్, పనిచేయని ఈపోస్ ● మండుటెండలో కార్డుదారుల నరకయాతన
మహారాణిపేట: రేషన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన రెండో రోజు సోమవారం కూడా ప్రజల కష్టాలు కొనసాగాయి. సాంకేతిక సమస్యలు, పంపిణీలో జాప్యం కారణంగా కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా రేషన్ షాపులలో సర్వర్ మొరాయింపు, ఈ–పోస్ యంత్రాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు తలెత్తడంతో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండలో నిలబడి, క్యూలైన్లలో సరుకుల కోసం ప్రజలు పడిగాపులు కాశారు. ఈ సాంకేతిక లోపాలు పంపిణీ ప్రక్రియను మరింత క్లిష్టతరం చేశాయి.
మోత తప్పలేదు
గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ‘ఇంటింటి రేషన్’ పథకం ద్వారా ఎండీయూ వాహనాల ద్వారా నిత్యావసరాలు ఇంటి వద్దకే చేరేవి. దీనివల్ల వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు ఎంతో సౌలభ్యం లభించేది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఎండీయూ వాహనాలను నిలిపివేయడంతో ప్రజలు మళ్లీ రేషన్ డిపోల వద్దకు వెళ్లక తప్పడం లేదు. రేషన్ డిపోల వద్ద సరుకులను మోసుకొని వెళ్లే దృశ్యాలు సోమవారం కూడా కనిపించాయి.
రెండో రోజు కేవలం 11 శాతం మాత్రమే..
జిల్లాలో రేషన్ పంపిణీ ప్రారంభమై రెండు రోజులు గడిచినా ఇబ్బందులు తప్పలేదు. మొదటి రోజు కేవలం 5.04శాతం మంది కార్డుదారులు మాత్రమే సరుకులు అందుకున్నారు. రెండో రోజు సోమవారం 11శాతం మందికి మాత్రమే సరుకులు అందజేశారు. మొత్తం రెండు రోజుల్లో 5,24,979 మంది కార్డుదారులలో కేవలం 96,019 మందికి బియ్యం పంపిణీ చేయగా, 84,384 మందికి పంచదార పంపిణీ చేశారు.

రెండో రోజూ అవే అవస్థలు

రెండో రోజూ అవే అవస్థలు