
ప్రకృతి ఒడిలో ఆరోగ్య యోగం
● చరిత్రలో నిలిచిపోయేలా యోగా వేడుకలు ● కలెక్టర్ హరేందిర ప్రసాద్ వెల్లడి ● తొట్లకొండపై ఘనంగా యోగాంధ్ర
కొమ్మాది: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చరిత్రలో నిలిచిపోయే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ తెలిపారు. బౌద్ధారామాల్లో ఒకటైన తొట్లకొండపై జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం ‘యోగాంధ్ర’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలు సంస్థలు, సంఘాల ప్రతినిధులు యోగాసనాలు వేశారు. ముందుగా మయన్మార్కు చెందిన బౌద్ధ గురువు రాజధర్మ, కంబోడియాకు చెందిన బర్మరే, విశాఖ బౌద్ధ సంఘ సభ్యులు ధర్మచారి ప్రార్థనలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం అందరూ వివిధ యోగాసనాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21 జరగనున్న యోగా వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. ఆర్.కె.బీచ్ నుంచి భీమిలి వరకు సుమారు ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఇందుకోసం గ్రామ, వార్డు స్థాయిల్లో యోగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే యోగా దినోత్సవంలో పాల్గొనే వారికి రవాణా సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమం తర్వాత కూడా ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యంతో ఉండడానికి యోగాను కొనసాగించాలని, దీనిని తమ జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసుకోవాలని కోరారు. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, భీమిలి ఆర్డీవో సంగీత్ మాథూర్, జిల్లా పర్యాటక శాఖ అధికారి జి.మాధవి తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి ఒడిలో ఆరోగ్య యోగం

ప్రకృతి ఒడిలో ఆరోగ్య యోగం

ప్రకృతి ఒడిలో ఆరోగ్య యోగం