
● వానమ్మ.. వాన!
● వర్షాలతో ఉపశమనం ● మొన్నటి వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలతో విలవిల ● మరో రెండు రోజుల పాటు జిల్లాలో అక్కడక్కడా వానలు
సాక్షి, విశాఖపట్నం : అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో కొంత కాలంగా వాతావరణంలో భిన్నమైన మార్పులు కనిపిస్తున్నాయి. సాధారణంగా మే నెల అంటే.. భానుడి భగభగలు.. సెగలు కక్కించే ఉక్కపోత.. ఊపిరి సలపని వడగాలుల తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. కానీ.. ఈసారి మాత్రం కొద్ది రోజుల పాటు చల్లని వాతావరణం ఏర్పడుతోంది. కొద్ది రోజులుగా.. వాతావరణం ఎండలతో మొదలై.. మధ్యలో వర్షాలు పడి మళ్లీ.. ఎండలు పెరిగి.. సాయంత్రం నాటికి మబ్బుల వాతావరణంతో చల్లబడుతోంది. ప్రతి రోజూ సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు నగరానికి గొడుగులు పడుతున్నాయి. ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకూ జిల్లాలో సగటు వర్షపాతం కంటే మూడు రెట్లకు పైగా అధికంగా నమోదవ్వడం విశేషం. దశాబ్ద కాలంలో మే నెలలో మొదటి 4 రోజులు ఈ తరహా వర్షపాతం నమోదుకావడం ఇదే ప్రథమమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మే 1 నుంచి 4 వరకూ సగటు వర్షపాతం 5.1 మి.మీ కాగా.. ఈసారి 17 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రీమాన్సూన్ సీజన్లో వర్షాలు కురవడం సర్వసాధారణమే అయినా.. ఈసారి మాత్రం అకాల వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం(సీడబ్ల్యూసీ) అధికారులు చెబుతున్నారు. మరో రెండు మూడు రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని వెల్లడించారు. జిల్లాలో ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయనీ.. నగర పరిధిలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఈదురుగాలుల ప్రభావం కొనసాగుతుంటుందనీ.. ఉరుములు, మెరుపుల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని చెబుతున్నారు. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

● వానమ్మ.. వాన!

● వానమ్మ.. వాన!