
ఫార్మర్ రిజిస్ట్రీ అంతంతే!
వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఓ పక్క సర్వర్ మొరాయింపు, ఇంకోపక్క వ్యవసాయ పనుల్లో రైతుల నిమగ్నం, మరోవైపు అవగాహన లేమి.. వెరసి పంటల ఆన్లైన్ నమోదుకు అడ్డంకిగా మారాయి.
కొడంగల్ రూరల్: గ్రామాల్లో ఫార్మర్ రిజిస్ట్రీ నామమాత్రంగానే కొనసాగుతోంది. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండడంతో నమోదు చేసుకోవడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఫార్మర్ రిజిస్ట్రీ ఉద్దేశం నీరుగారుతోంది. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతువేదిక, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో రైతులకు అందుబాటులో ఉంటూ ఫార్మర్ రిజిస్ట్రీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలో 17,449 మంది కర్షకులు ఉండగా కేవలం 5,825 మంది మాత్రమే(33శాతం) రిజిస్ట్రీ చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు.
మే 5 నుంచే ప్రారంభం
వ్యవసాయరంగంలో రైతుల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయడానికి, వారి భూమి యాజమాన్యం, పథకాల లభ్యత అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో నమోదు చేసుకున్న రైతులకు ఆధార్కార్డు మాదిరి 11 అంకెలతో కూడిన ఐడీని అందిస్తారు. ఈ ప్రక్రియను మే నెల 5వ తేదీ నుంచి వ్యవసాయ అధికారులు ప్రారంభించారు. అప్పటి నుంచి రైతులు ధాన్యం అమ్మకాలు, కొనుగోలు కేంద్రాలకు వెళ్లడం వంటి పనులు మాత్రమే ఉండడంతో చక చకా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్నారు. అనంతర పరిణామాలలో వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో రైతులు రిజిస్ట్రీ ప్రక్రియకు ఆసక్తి చూపడం లేదు.
పథకాలకు ఐడీ కచ్చితం
ఫార్మర్ రిజిస్ట్రీలో రైతులకు అందించే ఐడీ కీలకంగా మారనుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ ఐడీతోనే రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైతుల పథకాలు దక్కనున్నాయని అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టనున్న పంటల నమోదు కార్యక్రమంలో ఈ ఐడీని ఉపయోగించనున్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారులు గ్రామాల్లోని రైతు వేదికలు, గ్రామపంచాయతీ కార్యాలయాలలో ఫార్మర్ రిజిస్ట్రీపై అవగాహన కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. భూమి ఉన్న ప్రతిరైతు తప్పనిసరిగా ఈ ప్రత్యేక రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందాలని సూచిస్తున్నారు. రైతులు తమ పట్టాదారు పాస్బుక్, ఆధార్కార్డు జిరాక్స్లను మొబైల్ నంబర్ను వ్యవసాయ విస్తరణ అధికారులకు అందించాలని పేర్కొంటున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీతో ముఖ్యంగా పీఎం కిసాన్ నిధి, ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన వంటి పథకాల అమలులో ఐడీ తప్పనిసరిగా అవసరమవుతుందని నొక్కి చెబుతున్నారు. రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సాంకేతిక సమస్యలతో ఇబ్బంది
దోమ: మండలంలో 28 శాతమే ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు పూర్తయిందని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం 36 గ్రామ పంచాయతీలలో 16,606 మంది రైతులకు ఉండగా, ఐదు వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్కు ఓ వ్యవసాయ విస్తరణ అధికారి విధులు నిర్వహించగా, ఆయా గ్రామాలకు వెళ్లి ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. చాలా చోట్ల సర్వర్లు మొరాయిస్తున్నాయని అధికారులు, రైతులు వాపోతున్నారు. రైతు భరోసా, పంటల నమోదు, విత్తనాలు, ఎరువుల సరఫరా తదితర విషయాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు ఇప్పటికే బీజీ ఉండగా, కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో ఫార్మర్ రిజిస్ట్రీని తీసుకురావడంతో ఏఈఓలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. దీనికి తోడు సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు అధికమవుతున్నాయి.
వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ
నమోదు ప్రక్రియకు ముందుకు రాని కర్షకులు
తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని
అధికారుల సూచన

ఫార్మర్ రిజిస్ట్రీ అంతంతే!