
దాడి కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలి
కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం గుర్రంపల్లిలో దళితులపై దాడిచేసిన నిందితులపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో శనివారం గుర్రంపల్లి గ్రామాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శంకర్తోపాటు మానవ హక్కుల వేదిక జంగయ్య, పాండు మాట్లాడుతూ.. బొడ్రాయి ఉత్సవాల్లో కొందరు యువకులు డ్యాన్స్ చేస్తూ ఆడ పిల్లలపై పడబోతుంటే అడ్డుకున్న దళిత యువకుడు ప్రవీణ్పై దాడిచేయడం బాధాకరమన్నారు. అంతటితో ఆగకుండా మరుసటి రోజు ప్రవీణ్ సోదరుడు శ్రీనివాస్ పంచాయతీ కార్యాలయం వద్ద ఫోన్ మాట్లాడుతుండగా దాడి చేసి చేయి విరగ్గొట్టారన్నారు. ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేసినా నిందితులపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే వారిపై కేసు నమోదుచేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు యాదయ్య, రామచంద్రయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.