
జాతీయ రహదారిపై పత్తాలేని పెట్రోలింగ్!
పరిగి: జాతీయ రహదారి వెంట ఎక్కడా పోలీసులు కనిపించడం లేదు. క్రమం తప్పకుండా గస్తీ నిర్వహిస్తూ అనుక్షణం పర్యవేక్షించాల్సిన వాహనాలు సైతం పత్తాలేకుండా పోయాయని ప్రజలు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రమా దాలు జరిగిన సమయంలో వెంటనే స్పందించే వారు లేక క్షతగాత్రులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డుపై యాక్సిడెంట్లను నివారించడంతో పాటు ప్రమాదాలు జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు హైవే పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. కానీ వీటిలో ఎవరూ అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైవేలపై నిత్యం యాక్సిడెంట్లు చోటు చేసుకుంటున్నా పోలీసులు ఎందుకు స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. హైదారాబాద్ నుంచి కర్ణాటక వెళ్లేందుకు హైదారాబాద్– బీజాపూర్ మార్గం ఒక్కటే ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు సైతం ఈరూట్లోనే రాకపోకలు సాగిస్తాయి. రద్దీ కారణంగా ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. హైవే పెట్రోలింగ్ పోలీసుల అలసత్వంతోనే ఈ పరిస్థితి ఎదురవుతోందనే ఆరోపణలున్నాయి.
రెండు హైవే పోలీస్ స్టేషన్లు
పూడూర్ మండలం అంగడి చిట్టంపల్లి నుంచి కొడంగల్ మండలం రావులపల్లి వరకు జిల్లాలో జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈమార్గంలో రెండు హైవే పెట్రోలింగ్ పోలీస్ స్టేషన్లు ఉన్నప్పటికీ నామమాత్రంగానే సేవలు అందిస్తున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం మన్నెగూడ, కొడంగల్లో వీటిని ఏర్పాటు చేశారు. అప్పట్లో పూర్తి స్థాయి సిబ్బందిని నియమించినా ప్రస్తుతం ఒక స్టేషన్లో ఒక ఎస్ఐ, నలుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. అరకొర సిబ్బందితో విధులు సక్రమంగా నిర్వహించడం లేదనే ఆరోపణాలున్నాయి. మన్నెగూడలో ఏర్పాటు చేసిన హైవే పెట్రోలింగ్ స్టేషన్ సిబ్బంది అంగడిచిట్టంపల్లి నుంచి గడిసింగాపూర్, కొండంగల్ పీఎస్ సిబ్బంది రావుపల్లి నుంచి గడిసింగాపూర్ వరకు విధులు నిర్వహించాలి. కానీ వీరు ఏ ఒక్క రోజు కూడా కనిపించడం లేదని ప్రజలు చెబుతున్నారు.
నిత్యం ప్రమాదాలు
జాతీయ రహదారిపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపుతున్నారు. రాత్రి వేళ వీటిని ఢీకొట్టి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు వెంట పోలీసులు, పెట్రోలింగ్ వాహనాలు లేకపోవడంతో కొంత మంది ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, ఇప్పటికై నా హైవే పెట్రోలింగ్ పెంచాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
కనిపించని గస్తీ వాహనాలు
జిల్లా పరిధిలో రెండు పీఎస్లు ఉన్నా సేవలు అంతంతే
హైదారాబాద్– బీజాపూర్ హైవేపై నిత్యం ప్రమాదాలు
పట్టించుకోని పోలీసు అధికారులు
వెంటనే స్పందిస్తున్నారు
జాతీయ రహదారిపై రెండు పెట్రోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. రెండు షిఫ్టులుగా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. హైవేపై ప్రమాదాలు జరిగిన వెంటనే మా అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి సకాలంలో చర్యలు తీసుకుంటున్నారు.
– శ్రీనివాస్, పరిగి డీఎస్పీ