
పశువుల తరలింపును అడ్డుకున్నందుకే..
తాండూరు టౌన్: అక్రమంగా పశువులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని అడ్డుకోవడంతో కొందరు వ్యక్తులు తమపై దాడి చేశారని పెద్దేముల్ మండలానికి చెందిన పలువురు యువకులు బుధవారం తాండూరు డీఎస్పీకి బాలకృష్ణా రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. పెద్దేముల్ మండలం జనగామ శివారులో మంగళవారం అర్ధరాత్రి ఓ అటవీ శాఖాధికారికి చెందిన ఫాంహౌస్ నుంచి 20 వరకు పశువులను డీసీఎంలో తరలిస్తుండగా, మంబాపూర్కు చెందిన రమేష్ సాగర్, రాము, అంజి అడ్డుకున్నారు. డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో డీసీఎం వాహనదారులతోపాటు మరి కొందరు యువకులపై దాడి చేశారు. దాడికి పాల్పడిన వారితో పాటు పశువుల తరలింపునకు సహకరించిన అటవీ శాఖ అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ రజినీకాంత్, పట్టణ కార్యదర్శి కిరణ్ డీఎస్పీని కోరారు. ఈ విషయమై తగు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారు.
మాపై దాడి చేశారు
డీఎస్పీకి యువకుల ఫిర్యాదు
చర్యలు తీసుకోవాలని
బీజేపీ నాయకుల డిమాండ్