
ఆటకెక్కిన మైదానాలు!
తెలంగాణ క్రీడా ప్రాంగణాల్లో కానరాని అభివృద్ధి
● జిల్లాలోని అన్ని జీపీల్లో ఆట స్థలాలు ● క్రీడా పరికరాలు, వసతులు కల్పించని వైనం ● నిర్వహణ లేక పిచ్చి మొక్కలతోనిండిన మైదానాలు ● నెరవేరని ప్రభుత్వ లక్ష్యం
ధారూరులో నిరుపయోగంగా మారిన క్రీడా ప్రాంగణం
వికారాబాద్: జిల్లాలోని తెలంగాణ క్రీడా ప్రాంగణాలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. మూడేళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. స్థలం కేటాయించి నామమాత్రంగా చదును చేయించి బోర్డుల ఏర్పాటుతో సరిపెట్టింది. క్రీడాపరికరాలు, మౌలిక వసతులు కల్పించకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. క్రీడా మైదానాల కోసం అప్పట్లో తహసీల్దార్లు నానా ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల స్థల వివాదాలు తలెత్తడంతో వాటిని అధిగమించి భూమి కేటాయించారు. ప్రస్తుతం వారి శ్రమ వృథా అయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులు అనేక మంది ఉన్నారు. వారికి క్రీడా పరికరాలు, ఆత్మరక్షణ కిట్లు, బూట్లు వంటివి సరఫరా చేయలేదు. క్రీడా మైదానాలు ఉన్నా వాటి నిర్వహణను గాలికొదిలేశారు. ప్రస్తుతం చాలా ప్రాంగణాలు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. మరి కొన్ని చోట్ల రాళ్లు, గుట్టలు ఉండటంతో క్రీడలకు అనుకూలంగా లేవు.
ప్రతి గ్రామ పంచాయతీలో..
జిల్లాలో 585 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రతి చోటా ఒకటి చొప్పున క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఒక్కో జీపీలో 2వేల చదరపు గజాలు లేకుంటే 20 గుంటలకు తగ్గకుండా భూమిని కేటాయించారు. ఇందుకోసం ప్రభుత్వ, ఫారెస్టు భూములను సేకరించారు. ప్రభుత్వ భూమి లేనిచోట జీపీల్లో లేఅవుట్లు చేస్తే వాటి ద్వారా సామాజిక అవసరాల కింద ఇచ్చే 10 శాతం భూమిని క్రీడా ప్రాంగణాలకు కేటాయించేందురే వీలు కల్పించారు. ఇన్ని ఇబ్బందులు పడి అధికారులు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాలకు స్థలాలు సమకూర్చారు. అయితే మౌలిక వసతులు, పరికరాలు సమకూర్చకపోవడం,కీడా ప్రాంగణాల నిర్వహణను గాలికి వదిలేయడంతో నేడు అవి నిరుపయోగంగా మారాయి.
కనీసం మూడెకరాలు ఉండాలి
గత ప్రభుత్వం క్రీడలకు అవసరమైన మేర స్థలాలు కేటాయించలేదని క్రీడాకారులు అంటున్నారు. 2వేల చదరపు గజాలు లేకుంటే 20 గుంటల భూమి క్రికెట్కు సరిపోదని వారు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది యువకులు క్రికెట్ తోపాటు కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ తదితర ఆటలు ఆడుతుంటారు. ప్రస్తుతం ఉన్న స్థలంలో ఒక్క ఆట ఆడుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. మరో క్రీడ ఆడాలంటే ఇబ్బందులు ఎదురవుతాయి. కనీసం మూడు ఎకరాల స్థలం ఉంటే క్రికెట్కు అనుకూలంగా ఉంటుందని యువకులు అంటున్నారు. ప్రతి గ్రామంలో ఎక్కువ మంది క్రికెట్టే ఆడతారని తెలిపారు. ఒకే చోట మూడు ఎకరాల స్థలం అందుబాటులో లేకుంటే రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక చోట క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోంది. ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపాలని, అలాగే పరికరాలు, వసతులు కల్పించాలని క్రీడాకారులు కోరుతున్నారు. క్రీడా ప్రాంగణాల నిర్వహణ బాధ్యతలు గ్రామ పంచాయతీలకు అప్పగించి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పలువురు అభిప్రాయ పడ్డారు.