
కబ్జా కాకుంట
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రియల్టర్ల భూ దాహానికి ఖాళీ ప్రభుత్వ స్థలాలే కాదు.. చెరువులు, కుంటలు సైతం మాయమవుతున్నాయి. భగ్గున మండుతున్న ఎండలకు చెరువులు, కుంటలన్నీ ఎండిపోయాయి. కాల్వలు, కట్టలు, అలుగులు సహా శిఖం భూములు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో ఆ పక్కనే పట్టా భూములు కొనుగోలు చేసిన రియల్టర్లు కల్వర్టులు, కాల్వలను సైతం చదును చేసి తమ వెంచర్లలో కలిపేస్తున్నారు. వరదనీరు పారకుండా అడ్డుకట్టలు వేస్తూ.. రైతుల పొలాల మీదకు మళ్లిస్తున్నారు. చెరువులు, కుంటలపై ఎప్పటికప్పుడు నిఘా పెంచాల్సిన అధికార యంత్రాంగం అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కళ్లముందే కుంటల ఆనవాళ్లను చెరిపేస్తుండటంతో కొంతమంది రైతులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
హద్దులు దాటి..
జిల్లా వ్యాప్తంగా 2,132చెరువులు, కుంటలు 10, 946 ఎంఎఫ్టీ సామర్థ్యం కలిగి ఉన్నాయి. వీటి పరిధిలో 70,067 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రభుత్వం వీటిలో ఏటా 1.20 కోట్ల చేప పిల్లలను వదులుతోంది. 400 టన్నుల కుపైగా దిగుబడి వస్తోంది. వేలాది మంది మత్య్సకారులు ఈ చెరువు లు, కుంటలనే నమ్ముకుని జీవిస్తున్నారు. వేసవిలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. బఫర్జోన్లు, ఫుల్ ట్యాంక్ లెవల్లోని నీరు పూర్తిగా ఇంకిపోయింది. ఇదే అవకాశంగా భావిస్తున్న కొంతమంది అక్ర మార్కులు రాత్రికి రాత్రే మట్టి నింపుతున్నారు.
పెద్దకుంట కబ్జా
కడ్తాల్: మండలంలోని వంపూగూడ గ్రామ సర్వే నంబర్ 40లోని ‘పెద్దకుంట’కు సంబంధించిన 1.12 ఎకరాల ఎఫ్టీఎల్ భూమిని కబ్జా చేసిన వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బుధవారం గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రెవెన్యూ సదస్సుకు హాజరైన అధికారులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పోతుగంటి అశోక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం డిప్యూటీ తహసీల్దార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. వెంటనే పెద్దకుంటను సర్వే చేసి, హద్దులు నిర్ధారించాలని కోరారు. భూ భారతి సదస్సుల్లో భాగంగా బుధవారం ఆయా గ్రామాలకు హాజరైన అధికారులకు ఈవిషయమై ప్రజలు ఫిర్యాదులు అందించారు.
మొద్దులకుంటలో మట్టి
యాచారం: గాండ్లగూడెం సమీపంలోని మొద్దులకుంటను ఓ వ్యాపారి మట్టితో పూడ్చేసినట్లు గుర్తించిన పలువురు రైతులు బుధవారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డికి ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 313లోని పట్టా భూమి యజమానులు కొన్ని రోజులుగా మట్టితో కుంటను పూడ్చేస్తున్నారని, ఎఫ్టీఎల్, బఫర్జోన్ కనిపించడకుండా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన ఆర్డీఓ వెంటనే పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ అయ్యప్ప, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. వెంటనే కుంట వద్దకు చేరుకున్న అధికారులుపోసిన మట్టిని తీసేయాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
చెరువుల, కుంటల అన్యాక్రాంతంపై ఫిర్యాదులు
అక్రమార్కులను కట్టడి చేయాలని అభ్యర్థన