
సమగ్రాభివృద్ధే లక్ష్యం
స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్
● ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ● పాల్గొన్న ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి
వికారాబాద్: ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన స్పీకర్ అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో గ్రామ, పట్టణ, నగరాలు సమగ్రాభివృద్ధి సాధిస్తున్నాయని పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ఇందిరా మహిళా శక్తి మిషన్కు శ్రీకారం చుట్టిందన్నారు. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో జిల్లాలో ఇప్పటి వరకు రూ.20.37 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహిస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.
5,214 మందికి ఇందిరమ్మ ఇళ్లు
రాష్ట్రంలో ఏ ఒక్కరూ సొంత ఇల్లు లేనివారు ఉండరాదన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 5,214 పేదలకు ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. తొలి దశ నిర్మాణం పూర్తి చేసుకు న్న వారికి రూ.92లక్షలు అందజేసినట్లు తెలిపారు. జిల్లాలో 1,00,358 రైతులకు రూ.849 కోట్లు రుణ మాఫీ చేసినట్లు గుర్తుచేశారు. రైతు భరోసా పథకం కింద జిల్లాలోని 2,26,253 మంది రైతుల ఖాతాల్లో రూ.213 కోట్లు జమచేశామన్నారు. సన్న రకం వడ్లు 49,680 క్వింటాళ్లు కొనుగోలు చేసి బోనస్ కింద రూ. 2.48కోట్లు అందజేసినట్లు తెలిపారు. అలాగే 64,437 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.104 కోట్లు జమ చేశామని చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. జిల్లాలో 19,888 లబ్ధిదారులకు మొదటి విడతగా రూ.11.93 కోట్ల కూలీల ఖాతాల్లో జమ చేసామని తెలిపారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందితెలిపారు. జిల్లాలో 1,603 ఉద్యోగ నియామకాలు పూర్తి చేసినట్లు వివరించారు.విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని స్పీకర్ ప్రసాద్కుమార్ పేర్కొన్నారు.జిల్లాలోని వికా రాబా ద్, పరిగి ప్రాంతాలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరైనట్లు తెలిపారు.రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద జిల్లాలో 15,188 మంది లబ్ధి పొందారని పేర్కొన్నారు. శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి రూ.41.65 కోట్లు అందజేశామని తెలిపారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. జూన్ 3 నుంచి కొత్త చట్టం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ఈ చట్టం అమలుకు ధారూరును పైలెట్ మండలంగా ఎంపిక చేశారని తెలిపారు. మూడు బృందాలను ఏర్పాటు చేసి, గ్రామగ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి 579 దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాలోని 1,07,525 మంది పింఛనుదారులకు ప్రతి నెలా రూ.26.22 కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. కలాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద జిల్లాలోని 4,738 మంది లబ్ధిదారులకు రూ.47.43 కోట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకొని జిల్లా వ్యాప్తంగా 6,941 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రజాప్రతినిధులు వీక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అదనపు ఎస్పీ హనుమంతరావు, ఆర్డీవో వాసుచంద్ర, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సమగ్రాభివృద్ధే లక్ష్యం