
చెరువులపై నిర్లక్ష్యపు నీడ
● ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని వైనం ● తగ్గిన నీటి సామర్థ్యం ● బీడుగా మారుతున్న ఆయకట్టు ● ఆందోళనలో రైతులు
కొడంగల్: నియోజకవర్గంలోని ప్రధాన చెరువులు, కుంటలు మరమ్మతులకు నోచుకోక బోసిపోయి కనిపిస్తున్నాయి. సాగునీరు లేక ఆయకట్టు భూములు బీడుగా దర్శనమిస్తున్నాయి. పలు చెరువుల కింద వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయినా పంటలు పండగ పొలాలు నిరుపయోగంగా మారాయి. నియోజకవర్గంలో వర్షాలు పడితేనే పంటలు పండుతాయి. వర్షాధార పంటలపై ఆధారపడి ఈ ప్రాంత రైతులు వ్యవసాయం చేస్తున్నారు. కొంతమంది రైతులు బోర్లు వేసుకొని పంటలు పండిస్తున్నారు. కురిసిన కొద్దిపాటి వర్షం నీరైనా చెరువుల్లోకి వచ్చి చేరుతుందా అంటే కష్టమే. నోటీఫైడ్ చెరువులు.. కుంటల్లో మట్టి పేరుకు పోయింది. పాటు కాల్వలకు మరమ్మతులు లేవు. వరద నీరు చెరువుల్లోకి వచ్చే పరిస్థితి లేదు. నియోజకవర్గంలోని చెరువులకు గతంలో చేసిన పనులు నామమాత్రంగా జరిగాయి. నిజాం కాలంలో నిర్మించిన చెరువులకు మరమ్మతులు చేయకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. హస్నాబాద్ చెరువుకు 950 ఎకరాల ఆయకట్టు, కొడంగల్ చెరువుకు 550 ఎకరాల ఆయకట్టు ఉంది. కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లోని చెరువులు, కుంటలు నిండటం లేదు. దీంతో పంటలు సాగు చేయడం లేదు. కొడంగల్ మండలంలో 5 నోటీఫైడ్ చెరువులు ఉన్నాయి. వందలాది మంది రైతులకు చెరువుల కింద ఆయకట్టు భూములు ఉన్నాయి. మిషన్ కాకతీయ పనులు నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో జరగలేదు. ఇప్పటికై నా చెరువుల మరమ్మతులపై అధికారులు దృష్టి సారించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.