
‘ధరణి’తో దగా
● రైతుకు మేలు చేకూర్చేందుకే ‘భూ భారతి’ ● స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
ధారూరు: ధరణి పేరిట గత ప్రభుత్వం రైతాంగాన్ని దగా చేసిందని.. ఆ చిక్కులను పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భూ భారతిని తీసుకువచ్చారని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన స్పీకర్ను కాంగ్రెస్ నాయకులు ఎద్దుల బండిపై ఊరేగింపుగా రైతువేదికకు తీసుకువచ్చారు. అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి ఆర్ఓఆర్ చట్టంతో రైతులకు మేలు చేకూరుతుందన్నారు. రజతోత్సవం పేరిట మాజీ ముఖ్యమంత్రి పచ్చి అబద్దాలు మాట్లాడరని.. ఆయన మాటలను తెలంగాణ ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం రూ.54 వేల కోట్లు ఖర్చు చేసిందని.. 25 లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్లు రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. అనంతరం 155 మంది లబ్ధిదారులకు ఉద్యాన శాఖ ద్వారా మంజూరు అయిన సబ్సిడీ స్ప్రింక్లర్లను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, అసిస్టెంట్ కలెక్టర్ హర్షచౌదరి, ఆర్డీ వాసుచంద్ర, తహసీల్దార్ సాజిదాబేగం, ఎంపీడీఓ నర్సింలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ధారూరు మండల కేంద్రం, మోమిన్ఖుర్దు, మోమిన్కలాన్లో సీసీ రోడ్లను. అనంతరం నాగసాన్పల్లి రైల్వే గేట్ సమీపంలో రూ.1.40 కోట్లతో నిర్మించిన రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి, సీసీ రోడ్లను ప్రారంభించారు.
రైతుల శ్రేయస్సుకే ‘భూ భారతి’
బంట్వారం: రైతుల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. సోమవారం కోట్పల్లి మండల పరిధిలోని బుగ్గాపూర్ ఫంక్షన్హాల్లో భూ భారతి ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. కొత్త చట్టంతో వారసత్వ, ప్రభుత్వ, అటవీ, సాగునీటి శాఖ, అసైండ్ భూమి, దేవాదాయ శాఖ భూముల వివరాలు స్పష్టంగా తెలుస్తాయన్నారు. చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. రైతులకు భూముల విషయంలో జవాబుదారీతనాన్ని పెంచుతుందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి అధికారులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. కోర్టులను ఆశ్రయించకుండా భూ సమ్యలను పరిష్కరించే వెసులుబాటు భూ భారతి చట్టంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషన ల్ కలెక్టర్ లింగ్యానాయక్, వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర,కోట్పల్లి తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
సేవలు సులభతరం
తాండూరు: భూ భారతి ఆర్ఓఆర్ చట్టంతో రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. సోమవారం పెద్దేముల్ మండల కేంద్రంలో భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్కుమార్ మాట్లాడుతూ.. కొత్త చట్టంతో రిజిస్ట్రేషన్, నిషేధిత భూములు, ఆర్ఓఆర్ మార్పులు, చేర్పులు, సాదాబైనామాలు తదితర సేవలు సులభతరం అవుతాయన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. భూ భారతి చట్టంలో రైతుల వద్దకే అధికారులు వచ్చి సమస్యలు పరిష్కరించేలా రూపొందించారన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మాట్లాడుతూ.. జూన్ 2వ తేదీ నుంచి భూ భారతి చట్టం అమలు చేసేందుకు భూ భారతి పోర్టల్ తీసుకొస్తున్నామన్నారు. కలెక్టర్ ప్రతీక్జైన్ రైతుల ప్రశ్నలకు జవాబులిస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ధారాసింగ్, నాయకులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.