
మామిడీలా
● గిట్టుబాటుపై ఆందోళన
● రైతులకు సర్కారు భరోసా కరువు
తిరుపతి అర్బన్ : జిల్లాలో 60 వేల ఎకరాల్లో మామిడి సాగులో ఉంది. ఈ ఏడాది పంట దిగుబడి రెండు నెలలు ఆలస్యంగా వచ్చింది. ఎప్పుడు లేని విధంగా పూత పెద్ద ఎత్తున రాలిపోయింది. 60 వేల ఎకరాల్లో 3.75 లక్షల టన్నుల మామిడి దిగుబడి వస్తుందని అంచనా. మామిడి గుజ్జు పరిశ్రమ నిర్వాహకులు సిండికేట్ కావడంతో మార్కెట్లో మామిడికి నామమాత్రపు ధరలకు అడుగుతున్నట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు.
పరిశ్రమ నిర్వాహకుల కష్టాలు
మామిడి గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు కూడా తమ వద్ద 1.60 లక్షల టన్నుల గుజ్జు నిల్వలున్నాయని చెబుతున్నారు. వాటిని విక్రయిస్తేనే పెట్టిన పెట్టుబడులు వస్తాయని కానీ ఏడాదిగా నిల్వ ఉండడంలో బ్యాంక్లకు చెల్లించాల్సిన రుణాలను కట్టలేకపోతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా ఎగుమతులు ఆగిపోయాయని దీంతోనే సరైన ధరలకు కొనుగోలు చేయలేక పోతున్నామంటున్నారు.
తోతాపురి టన్నుకు రూ.12 వేలు ఇవ్వాలని
జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తోతాపురి మామిడికి టన్నుకు రూ.12 వేలు చొప్పున కొనుగోలు చేయాలని ఇటీవల ఫ్యాక్టరీ యాజమాన్యానికి సూచించారు. అయితే ఇందులో టన్ను రూ.8 వేలు లెక్కన ఫ్యాక్టరీ యాజమాన్యం తీసుకుంటే...మిగిలిన రూ.4 వేలు రైతుల ఖాతాల్లో సర్కార్ జమ చేస్తుందని వెల్లడించారు. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం తమిళనాడు రాష్ట్రం నుంచి తోతాపురి టన్ను కేవలం రూ.4 వేలకే లభిస్తుండడంతో కొనలేకపోతున్నారు. మరోవైపు జిల్లాలో ఒక్కో రైతు తిరుచానూరులోని మామిడి కాయల మండికి తోతాపురిని పంపుతున్నారు. జులై ఆఖరుకు జిల్లా వ్యాప్తంగా మామిడి పంట కోతలు పూర్తి కానున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మామిడికి గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.