లక్ష ఇండ్లను మంజూరు చేశాం: హరీశ్‌రావు

Harish Rao Says Government Sanctioned One Lakh Houses  - Sakshi

సాక్షి, మెదక్‌: కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆడపిల్లను ఇంట్లో లక్ష్మీ దేవతగా కొలుస్తున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మెదక్‌ జిల్లా చేగుంటలో శనివారం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు  తండాల్లో, గ్రామాల్లో కరెంటు కరువు ఉండేదని, ప్రస్తుతం రాష్ట్రంలో కరెంటుకు, ఎరువులకు కరువు లేదని తెలిపారు. రాష్ట్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ చొరవ ఎంతో ఉందని తెలిపారు. బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మవద్దని, రైతుల బోర్లకు  మీటర్లు పెట్టిన బీజేపీ ప్రభుత్వానికి దుబ్బాక ఉప ఎన్నికల్లో మీటర్ పెట్టాలని విమర్శించారు. రాష్ట్రంలో మిటర్లు పెడితే కేంద్రం నుంచి 2500 కోట్లు ఇస్తామన్నారని గుర్తు చేశారు.

అయితే రాష్ట్రంలో  రైతులు  మరణించిన వారం రోజులకే వారి అకౌంట్లో రైతు బీమా(ఐదు లక్షలు) జమ అవుతున్నదని తెలిపారు. కరోనా కష్టకాలంలో ఆదుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, రాష్ట్రంలో లక్ష ఇండ్లు మంజూరు చేసింది టీఆర్ఎస్  ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఎవరి ఖాళీ స్థలంలో వారు ఇల్లు కట్టుకునే విధానం ద్వారా చేగుంట మండలముకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. దసరా పండుగకు మేనమామ లాగా చీర పంపిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రతి తండాలను గ్రామ పంచాయతీ చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. 

ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. కొన్ని గ్రామాల్లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, ప్రతి తండాలో గుడిసెలు  లేకుండా ఇల్లు కట్టిస్తామని తెలిపారు. చేగుంట మండలంలోని కిస్టాపుర్  గ్రామాన్ని  గ్రామ పంచాయతీగా చేస్తామని పేర్కొన్నారు. కాగా చేగుంట మండలంలోని ఇబ్రహీంపుర్‌, రుక్మపుర్‌, చెట్ల తిమ్మై పల్లి అటవీ భూముల పరిష్కారం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం ద్వారా రైతులకు మేలు చేసిన ప్రభుత్వం తమ ప్రభుత్వమేనని, త్వరలో డిజిటల్ సర్వే నిర్వహించి రైతులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పింఛన్ల కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టేది రూ.11400 కోట్లు అయితే కేంద్రం ఇచ్చేది రూ.2300కోట్లు అని హరీశ్‌రావు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top