
క్లుప్తంగా
టాస్మాక్ దుకాణంలో లంచం ..
హెడ్కానిస్టేబుల్పై బదిలీ వేటు
కొరుక్కుపేట: ప్రభుత్వ టాస్మాక్ దుకాణంలో వెయ్యి రూపాయలు లంచం తీసుకున్న ఓ హెడ్ కానిస్టేబుల్ను సాయుధ దళాలకు బదిలీ చేశారు . తిరువెన్న నల్లూరు పట్టణ పంచాయితీ ప్రాంతంలో ఒక ప్రభుత్వ టాస్మాక్ దుకాణం నడుస్తోంది. రాత్రి 9 గంటలకు తిరువెన్న నల్లూరు పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ పరంథామన్ దుకాణం నుంచి ఆమ్యామ్యా వసూలు చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో టాస్మాక్ దుకాణంలో పనిచేస్తున్న ఓ సేల్స్ మెన్ తలుపుతెరిచి బయటకు వచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విల్లుపురం ఎస్పీ శరవణన్ హెడ్కానిస్టేబుల్ పరంథామన్ను విల్లుపురం సాయుధ పోలీసు దళానికి బదిలీ చేయాలని ఆదేశించారు.
రిటైర్డ్ జడ్జి ఇంట్లో చోరీ చేసిన ముగ్గురి అరెస్టు
తిరుత్తణి: రిటైర్డ్ జడ్డి ఫాంహౌస్లో చోరీ చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్టు చేసారు. వివరాలు.. కనకమ్మసత్రం సమీపం కావేరిరాజపురం వద్ద రిటైర్డ్ హైకోర్టు జడ్జి దినకరన్కు సొంతమైన 300 ఎకరాల పంటపొలం ఉంది. ఆ పొలంకు మధ్యలో ఫాంహౌస్ నిర్మించి తీరక సమయాల్లో వచ్చి వెళ్లేవారు. ఈక్రమంలో పాంహౌస్ మూసివుంచిన క్రమంలో జూన్ 15న ఫాంహౌస్ తాళం పగులగొట్టి దుండగులు ట్రాక్టర్ బ్యాటరీ, ఫ్యాన్లు చోరీ చేసుకెళ్లారు. ఎస్పీ శ్రీనివాస పెరుమాళ్ ఆదేశాలతో ప్రత్యేక బృందం ఎస్ఐ కుమార్ తన బృందంతో దర్యాప్తు చేపట్టింది. చేపట్లి తిరువలంగాడు సమీపం తోమూరు చెందిన ప్రభాకరన్(31), తిరుపతికి చెందిన సురేష్(29), రామజేరి గ్రామానికి చెందిన కమలకన్నన్(29) తదితరులను అదుపులోకి తీసుకుని వారి నుంచి కారు, బైకు, కత్తి స్వాధీనం చేసుకున్నారు.
వీఆర్కు తిరుత్తణి టీఎస్వో
తిరుత్తణి: రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న ముఠాతో సంబంధం కలిగివున్న తిరుత్తణి టీఎస్వోను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఆదేశించారు. వివరాలు.. రాష్ట్రంలో రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం ఉచిత రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రా సరిహద్దులోని తిరుత్తణి, పళ్లిపట్టు ప్రాంతాల్లో రేషన్కార్డుదారుల నుంచి బియ్యం అక్రమ రవాణా చేసే ఏజెంట్లు తక్కువ ధరలకు కొనుగోలు చేసి అధికారుల అండతో బస్సులు, కార్లు, రైళ్ల ద్వారా తరలిస్తున్నారు. ఈక్రమంలో తిరుత్తని టీఎస్వో వెంకటేశన్ రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే మహిళల వద్ద సెల్ఫోన్ ద్వారా మాట్లాడుతూ అసభ్య పదజాలం ఉపయోగించి తాను సూచిస్తున్న వ్యక్తులు మాత్రమే రేషన్ బియ్యం తరలించాలని, నెలకు సక్రమంగా డబ్బులు చెల్లిస్తున్న వారికి మాత్రమే అనుమతిస్తామని, తక్కిన వారిని అనుమతించనని, తనిఖీ చేసి వారిని అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆడియో కలకలం రేపింది. దీంతో టీఓస్వో వెంకటేశనన్ను విధుల నుంచి తొలగించి వెయిటింగ్ లిస్ట్లో వుంచి కలెక్టర్ ప్రతాప్ ఆదేశించారు.
ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం
తిరువళ్లూరు: ఒకే జట్టుగా తమిళనాడు పేరుతో గత నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలపై విసృతంగా ప్రచారం నిర్వహిస్తామని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్ స్పష్టం చేశారు. తిరువళ్లూరు జిల్లా కాకలూరులోని ఓ ప్రైవేటు మండపంలో విలేకరుల సమావేశాన్ని మంత్రి నాజర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాజర్ మాట్లాడుతూ ఒకే కూటమిలో తమిళనాడు పేరుతో రానున్న 45 రోజుల్లో ఇంటింటికీ వెళ్లి గత నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను వివరిస్తామన్నారు. తమ ప్రచారం ద్వారా ప్రభుత్వ పథకాలను, లబ్దిదారుల వివరాలను ప్రజలకు వివరించడంతో పాటూ 30 శాతం యువకులను పార్టీలోకి ఆకర్షిస్తామన్నారు. తమిళనాడు భాష, భూమి, ఆత్మభిమానం తదితర వాటిని పరిరక్షించడానికి తమ పోరాటం చేస్తామన్నారు. కులం, మతం పేరుతో రాజకీయం చేస్తున్న కొందరికి తమ ప్రచారం చెంపపెట్టులా మారుతుందన్నారు. ఈ సమావేశంలో తిరువళ్లూరు జిల్లా కన్వీనర్ తిరుత్తణి ఎమేమల్యే చంద్రన్, పొన్నేరి ఇన్చార్జ్ రమేష్రాజ్తో పాటూ పలువురు పాల్గొన్నారు.
భర్త హత్య కేసులో భార్య, ప్రియుడి అరెస్టు
అన్నానగర్: చైన్నె అశోక్ నగర్, హౌసింగ్ బోర్డు ఫ్లాట్ ఆన్లైన్ డెలివరీ ఉద్యోగి అయిన కలైయరసన్ (23)ను గత నెల 15వ తేదీన నరికి చంపారు. అతని భార్య వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో తేలింది. కలైయరసన్ భార్య తమిళరసి, ఆమె తల్లి సంధ్య, సోదరులు శక్తివేల్, సంజయ్ సహా మరో ఐదుగురిని ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ స్థితిలో, అశోక్ నగర్ పోలీసులు తమిళరసి వివాహేతర ప్రియుడు అయిన పులియంతోప్కు చెందిన ప్రముఖ రౌడీ శరవణన్ను మంగళవారం అరెస్టు చేశారు. అతనిపై వివిధ క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయ మేనేజర్గా ఉన్న శంకరరామన్ హత్య కేసులో కూడా అతను ఉన్నాడు. కె.కె. నగర్కు చెందిన కదిరవన్ హత్య కేసులో కూడా అతను ప్రమేయం ఉందని దర్యాప్తులో తేలింది.