
పాఠ్యపుస్తకాలు వస్తున్నాయ్
సూర్యాపేటటౌన్, తిరుమలగిరి : నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమకూర్చాల్సిన సౌకర్యాలపై విద్యాశాఖ ముందస్తుగానే దృష్టి సారించింది. ఇప్పటికే స్కూల్ యూనిఫామ్స్ కుట్టేందుకు సంబంధించిన వస్త్రాన్ని దర్జీలకు అందజేశారు. పాఠ్య పుస్తకాలు సైతం ముందస్తుగానే జిల్లాకు చేరుతున్నాయి. పాఠశాలల పునఃప్రారంభం నాటికే వాటిని అందించేలా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికి కొన్ని రాగా మిగిలినవి విడతల వారీగా రానున్నాయి.
జిల్లాకు 4.65లక్షల పుస్తకాలు అవసరం
ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలతో పాటు సంక్షేమ గురుకులాలు మొత్తం 1050 ఉన్నాయి. వీటిల్లో 90వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికి ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందజేయనున్నారు. కొత్తగా ప్రవేశాలు పొందేవారితోపాటు ప్రస్తుతం చదువుతున్న వారికి పాఠశాల ప్రారంభం రోజే పుస్తకాలు ఇవ్వనున్నారు. యూడైస్ ప్లస్ వివరాల ప్రకారం వీటిలో చదువుతున్న విద్యార్థులకు మొత్తం 4.65లక్షల పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. విడతల వారీగా గోదాంకు తరలిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాలలో గల గోదాంలో జిల్లాకు సంబంబంధించి పాఠ్యపుస్తకాలు భద్రపరుస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 87370 పైగా పుస్తకాలు చేరుకున్నాయి. జూన్ 12వ తేదీ లోగా పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు రానున్నాయి.
పక్కదారి పట్టకుండా నంబర్లు
వేసవి సెలవులు ముగిసే వరకు విడతల వారీగా గోదాంకు పుస్తకాలు చేరనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. పుస్తకాలు పక్కదారి పట్టకుండా వాటిపై వరుస క్రమంలో నంబర్లను ముద్రించారు. వీటి ఆధారంగా ఎన్ని మండలాలకు ఏయే పాఠ్య పుస్తకాలు వెళ్లాయని అధికారుల రికార్డుల్లో నమోదు చేస్తున్నారు.
ఫ పాఠశాలల పునఃప్రారంభం రోజునే అందించేందుకు సన్నాహాలు
ఫ జిల్లాకు 4.65లక్షల
పుస్తకాలు అవసరం
ఫ ఇప్పటికే గోదాంకు చేరుకున్న 87,370 పాఠ్యపుస్తకాలు
ఫ పుస్తకాలు పక్కదారి పట్టకుండా
నంబర్ల ముద్రణ
పాఠశాలల పునఃప్రారంభం రోజునే పంపిణీ చేస్తాం
విద్యార్థులకు పాఠశాలలు పునఃప్రారంభం రోజే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నాం. విడతల వారీగా పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి. వచ్చిన వాటిని గోదాం నిల్వ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ఎంఈఓల ఆధ్వర్యంలో సంబంధిత పాఠశాలలకు అందజేస్తాం.
– అశోక్, డీఈఓ
మీడియం వారీగా..
తెలుగు, ఇంగ్లిష్, ఉర్థూ మీడియంకు చెందిన పాఠ్య పుస్తకాలు పార్ట్ –1గా ప్రస్తుతం సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ, జెడ్పీ, కేజీబీవీల్లో చదివే విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్లో పుస్తకాలు ముద్రించారు. ఆదర్శ, సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యనభ్యసించే విద్యార్థులకు పూర్తిగా అదే మీడియంలో పుస్తకాలు అందజేసేలా కార్యాచరణ రూపొందించి వాటిని పంపిస్తున్నారు. వచ్చిన వాటిని మీడియం, తరగతుల వారీగా వేర్వేరుగా భద్రపరిచే బాధ్యతలను విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. అదేవిధంగా పుస్తకాల్లోని ప్రతి పాఠానికి బార్ కోడ్ ముద్రించడంతో సెల్ఫోన్లో స్కాన్ చేస్తే ఆ పాఠాన్ని వీడియో రూపంలో చూసుకునే సదుపాయం ఉంది.

పాఠ్యపుస్తకాలు వస్తున్నాయ్