
చోరీ జరిగిన ఇంట్లో పరిశీలిస్తున్న పోలీసులు
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ మండలం అవంతిపురంలో గురువారం తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ సతీష్వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. అవంతీపురం గ్రామంలోని కోదాడ–జడ్చర్ల ప్రధాన రహదారి వెంట నివాసముంటున్న శివనేని లక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. రోజు మాదిరిగానే లక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులు గురువారం మిర్యాలగూడకు కూలీ పనులకు వెళ్లగా చిన్న కుమార్తె స్కూల్కు వెళ్లింది. పెద్ద కుమార్తె మిర్యాలగూడలో కాలేజీకి వెళ్లింది. మధ్యాహ్నం పెద్ద కుమార్తె కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటికి వేసిన తాళం పగులగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. అంతేకాకుండా బీరువాలోని రూ.48వేలు చోరీకి గుర్తించి విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో లక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులు మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సతీష్వర్మ తన సిబ్బందితో పాటు నల్లగొండ నుంచి క్లూస్ టీంను పిలిపించి సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.