
ఆదిత్యుని సన్నిఽధిలో ప్రత్యేక పూజలు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి సన్నిధిలో ఆదివారం విశేషంగా భక్తులు పూజలు జరిపించుకున్నారు. జ్యేష్ట మాస ఆదివారం సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చి స్వామికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో వై.భద్రాజీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. ఉచిత ప్రసాదాలను పంపిణీ చేయించారు. ఇక అంతరాలయంలో ప్రత్యేకంగా తులసీదళాలతో ఆదిత్యుని మూలవిరాట్టును అలంకరించి సర్వదర్శనాలకు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ అనుమతించారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులు దర్శనాలకు క్యూలైన్లలోకి వచ్చేశారు. ఆరోగ్యం కోసం భక్తులు సూర్య నమస్కారాల పూజలు చేయించుకుంటే.. మరికొందరు భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. ఇదిలా ఉండగా ఒక్కరోజులోనే వివిధ దర్శనాల టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ.4,15,200, విరాళాలు, పూజల ద్వారా రూ.91,388, ప్రసాదాల విక్రయాల రూపంలో రూ.1.98 లక్షల వరకు ఆదాయం లభించిందని ఈవో భద్రాజీ తెలియజేశారు.
దర్శించుకున్న విజిలెన్స్ ఎస్పీ
అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని జిల్లా విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో వై.భద్రాజీ, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు ఆయనకు గౌరవంగా స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, డీ–1 ఏఈ సురేష్కుమార్, ఉంగటి పాపారావు తదితరులు పాల్గొన్నారు.

ఆదిత్యుని సన్నిఽధిలో ప్రత్యేక పూజలు