
ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలి
శ్రీకాకుళం క్రైమ్: నగరంలోని పాత శ్రీకాకుళంలో ఈనెల 10వ తేదీన జరిగే పెద్దమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి సిరిమాను ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. శ్రీకాకుళం పట్టణం, పాత శ్రీకాకుళం (మావూరు వీధి, కలెక్టర్ బంగ్లా, హరిజన వీధి, బాదుర్లపేట, కొత్తపేట, కునుకుపేట, దండివీధి, దేశర్ల వీధి, నక్కవీధి)లో పండగ నేపథ్యంలో రూట్మ్యాప్, బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి పర్యవేక్షించారు. జిల్లా పరిషత్, నక్కవీధి, సంతోషిమాత గుడి, కలెక్టర్ బంగ్లా తదితర రహదారి మార్గంలో కాలినడకన సందర్శించి భక్తుల దర్శనం, క్యూలైన్లను పర్యవేక్షించారు. సిరిమాను తిరిగే సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా సంబంధిత అధికారుల సాయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎండ తీవ్రత ఆధారంగా మున్సిపల్ అధికారుల సమన్వయంతో మంచినీటి సదుపాయాన్ని ఇరువైపులా ఏర్పాటు చేయాలన్నారు. సిరిమాను తిరిగే ముఖ్య కూడళ్లు, గుడిలోపల, క్యూలైన్ల వద్ద సీసీ కెమెరాల నిఘా ఉండాలని, డ్రోన్ కెమెరాలు ఉపయోగించి భక్తుల రద్దీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలించాలని, రహదారి మార్గాలు సులువుగా తెలుసుకునేలా సూచికా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, సీఐలు పైడపునాయుడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి