
రాత్రి దోపిడీలు
పగలు బొమ్మల వ్యాపారం..
● హైవేల్లో ఆగి ఉన్న వాహనదారులపై దోపిడీ
● చీకటిలో దోపిడీ దొంగల వీరంగం
● పోలీసులకు చిక్కిన నలుగురు దొంగలు, ఒకరు పరారీ
● రోడ్డు పక్కన గుడారాల్లో నివాసాలు
● వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వర రెడ్డి
శ్రీకాకుళం క్రైమ్ : హైవే పక్కన గుడారాల్లో నివాసం.. పగలు బొమ్మల వ్యాపారం.. రాత్రయితే దోపిడీ.. విశాఖ జిల్లా తగరపువలస నుంచి మన జిల్లా ఇ చ్ఛాపురం వరకు అంతా వీరి రాజ్యమే. జాతీయ రహదారి వెంబడి ఎక్కడైనా వాహనం ఆగి ఉంటే చాలు నగదు, మొబైళ్లు, పార్క్ చేసిన బైక్లు కూడా ఎత్తుకుపోతారు. జిల్లాలోనూ వీరి హస్తకళ చూపించారు. తాజాగా వీరిలో నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ మహేశ్వర రెడ్డి ఈ రాజస్థానీ దొంగల వివరాలను శుక్రవారం వెల్లడించారు.
ఆదాయం చాలక..
జిల్లాలోని రణస్థలం మండలం కోష్ట ప్రాంతంలో గత మూడేళ్లు నుంచి రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కు చెందిన ఆదిత్య పవార్ అలియాస్ వర్షమ్ (22), అతని సోదరులు, మరికొందరు కుటుంబీకులు రోడ్డు ప క్క న గుడారాల్లో నివసిస్తున్నారు. పగటి పూట బొమ్మ లు, దుప్పట్లు అమ్ముకోవడమే వీరి జీవనాధారం. ఆ ఆదాయం సరిపోకపోవడం, ఇంటిల్లిపాదీ చెడు అలవాట్లకు బానిసలు కావడంతో రాత్రిపూట రోడ్డుపక్కన దొంగతనాలకు ఒడిగడుతున్నారు. ఆదిత్యనే ఈ గ్యాంగ్కు లీడర్. అతని సోద రులు బంగారం పవార్ (21), సుధీర్ పవార్ (19)లే కాక బావమరుదులు సంజు షిండే అలియాస్ పటేల్, మరో బాలుడు కూడా ఇదే పనిలో ఉన్నారు.
మూడేళ్లుగా ఎవరికీ చిక్కక..
అర్ధరాత్రి వేళల్లో ఆగి ఉన్న లారీలు, వ్యాన్లలో నిద్రిస్తున్న వ్యక్తుల వద్దకు వెళ్లి వారికి తెలియకుండానే నగదు, ఫోన్లను తస్కరించి అక్కడి నుంచి పరారయ్యేవారు. గత ఆరు నెలల నుంచి ఆగి ఉన్న వాహనదారుల వద్దకు వెళ్లి కత్తులతో బెదిరించి.. వారిని కొట్టి డబ్బు, మొబైళ్లు లాక్కోవడం మొదలుపెట్టారు. అదే వారిని పట్టించింది. ఆమదాలవలసకు చెందిన బొడ్డేపల్లి సతీష్కుమార్, అతని స్నేహితుడు సేపీన బెనర్జీలు తమ బైక్పై గత నెల 18న నంది గాం మండలం కణితూరు గ్రామంలో జరిగే వివా హ వేడుకకు హాజరయ్యారు. తిరిగి అదే రోజు అర్ధరాత్రి పయనమవ్వగా మార్గం మధ్యలో వర్షం కురవడంతో సరిగ్గా 12:50 గంటలకు టెక్కలి మండలం విక్రంపురం గ్రామం జేఎన్ బస్టాప్ (ఎన్హెచ్–16 సమీప) వద్ద ఆగి కాసేపు ఆగారు. పైన పేర్కొన్న నిందితుల్లో నలుగురు ఒక్క ఉదుటున వారివద్దనున్న కత్తులను తీసి సతీష్, బెనర్జీల గొంతుపై పెట్టారు. అంతటితో ఆగక పిడిగుద్దుల వర్షం కురిపించి ఏమేం ఉన్నాయో తీయండంటూ బెదిరించడంతో రూ. 6 వేల నగదు, రెండు మొబైళ్లు ఇచ్చేశారు. వెంటనే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితులు టెక్కలి పోలీసులను ఆశ్రయించారు. అప్పటికే కొన్ని చోట్ల ఇలాంటి దొంగతనాలు జరుగుతుండటంతో ఎస్పీ కేవీ మహేశ్వరెడ్డి ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ (క్రైమ్) పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ ఎస్ఎస్ చంద్రమౌళి, టెక్కలి సీఐ విజయ్కుమార్ రెండు పోలీసు బృందాలుగా ఏర్పడి తీగ లాగారు.
ఎలా పట్టుబడ్డారంటే..
ఈ నెల 5న సాయంత్రం 6 గంటల సమయంలో టెక్కలి మండలం శ్యామసుందరాపురం గ్రామం జగదిమెట్ట ఫ్లై ఓవర్ సమీపంలో కొంతమంది అనుమానంగా రెండు ద్విచక్రవాహనాలపై సంచరిస్తున్న విషయం టెక్కలి ఎస్ఐ కె.మధుసూధనరావుకు తెలియడంతో సిబ్బందితో వెళ్లి నిందితులను పట్టుకున్నారు. వారిలో సంజు షిండే పరారయ్యాడు. వారి వద్ద నుంచి రూ.1,12,000 నగదు, రెండు ద్విచక్రవాహనాలు, ఎనిమిది మొబైళ్లు, ఆరు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్టేషన్కు తీసుకెళ్లి విచారించడం, జిల్లాలో పలుచోట్ల వారు చేసిన నేరాలు బయటపడ్డాయి.
ఎక్కడెక్కడ అంటే..
టెక్కలి, లావేరుల్లో ఒక్కొక్కటి చొప్పున, నందిగాం, నరసన్నపేట పీఎస్ల పరిధిలో రెండేసి చొప్పున వీరిపై కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా బాలుడిని జువైనల్ హోంకు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీసీఎస్, టెక్కలి పోలీసులను ఎస్పీ అభినందించారు.

రాత్రి దోపిడీలు