
పేదోడి బండి మరోసారి రద్దు
ముదిగుబ్బ: పేదలకు రైలు ప్రయాణం మరోమారు దూరం అయ్యింది. ధర్మవరం – తిరుపతి మార్గంలో తక్కువ టికెట్ ధరకే రాకపోకలు సాగించేవారు. ఇటీవల కుంభమేళా సందర్భంగా మూడు నెలలపాటు ప్యాసింజర్ రైళ్లు తాత్కాలికంగా రద్దు చేశారు. పునరుద్ధరణ తర్వాత నెల రోజులకే మరోమారు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు బ్రేక్ పడింది. ఈ మార్గంలో ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. కానీ ప్యాసింజర్ రైళ్లను మాత్రమే తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు.
● అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల మీదుగా గుంతకల్లు–తిరుపతి– గుంతకల్లు (రైలు నంబర్ 57403– 57404), తిరుపతి–కదిరిదేవరపల్లి– తిరుపతి (రైలు నంబర్ 57405–57406) ప్యాసింజర్ రైళ్లను ధర్మవరంలోని రైల్వే జంక్షన్లో ఫేజ్–2 యార్డ్లో ఎన్ఐ పనుల కోసం ఈ నెల 15 నుంచి నెల రోజుల పాటు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ధర్మవరం –నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలు (రైలు నెంబర్ 17247–17248 రైలు నర్సాపూర్ నుంచి కదిరి వరకు మాత్రమే నడుస్తుంది. ఈ రైళ్ల రద్దు కారణంగా ముదిగుబ్బ నుంచి ప్రయాణించే సాధారణ ఉద్యోగులు, పేద మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్యాసింజర్ రైళ్లే ఎందుకు రద్దంటే..
ధర్మవరం జంక్షన్లో యార్డ్ సవరణ పనుల కోసం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే రద్దు చేశారు. అయితే అదే లైనుపై నడుస్తున్న పద్మావతి, సెవెన్హిల్స్, అమరావతి, అకోలా, అరుణాచలం వెళ్లే ఈ ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రం నడుస్తున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజల కోసం ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తక్కువ ధరకే సౌకర్యవంతమైన ప్రయాణం..
ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణించే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు రైలు టికెట్ ధర అతి తక్కువగా వుంది. ముదిగుబ్బ నుంచి తిరుపతికి టికెట్ ధర రూ.50 మాత్రమే. తిరుమలకు ముదిగుబ్బ నుంచి వందలాది మంది భక్తులు వెళ్తుంటారు. అదే విధంగా అనారోగ్యంతో బాధపడే పేద ప్రజలు తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్తుంటారు. అనంతపురం, ధర్మవరం, కదిరి నుంచి చాలా మంది ఉద్యోగస్తులు ప్యాసింజర్ రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. బస్సులో టికెట్ ధర ఎక్కువ కావడంతో రైలు ప్రయాణాన్నే చాలామంది ఎంచుకుంటున్నారు.
భారీగా తగ్గిన రైలు చార్జీలు..
ముదిగుబ్బ నుంచి తిరుపతికి ప్యాసింజర్ రైలులో వెళ్లే వారికి టికెట్ ధర రూ.50 మాత్రమే. స్లీపర్ టికెట్ ధర రూ.120 మాత్రమే. గతంలో ఇదే రిజర్వేషన్ టికెట్ ధర రూ.330 ఉండేది. సిట్టింగ్ కోసం రిజర్వేషన్ చేసుకునే టికెట్ ధర ముదిగుబ్బ నుంచి తిరుపతికి రూ.65 మాత్రమే. ఇదే టికెట్ ధర గతంలో రూ.120 ఉండేది.
నాడు కుంభమేళా పేరిట
3 నెలలు బంద్
నేడు ధర్మవరం జంక్షన్లో
పనుల నేపథ్యంలో రద్దు
ప్యాసింజర్ రైళ్ల తాత్కాలిక రద్దుతో తప్పని ఇబ్బందులు