
ఉచిత పాఠ్యపుస్తకాలు సిద్ధం
● ప్రారంభమైన పంపిణీ ● 12న విద్యార్థులకు అందజేత ● తొలగనున్న విద్యార్థుల ఇబ్బందులు
న్యాల్కల్(జహీరాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేంకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు పాఠశాలల ప్రారంభానికి ముందే ఉచిత పాఠ్య పుస్తకాలు అందించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
పుస్తకాల పంపిణీ ప్రారంభం
జిల్లాలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. జిల్లాలో 1351 పాఠశాలలుండగా.. అందులో ప్రాథమిక పాఠశాలలు 860, ప్రాథమికోన్నత పాఠశాలలు 197, ఉన్నత పాఠశాలలు 205, 89 ఆదర్శ, గురుకుల తదితర పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 1,31,294 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి 7,33,210 పుస్తకాలు అవసరం ఉండగా.. 6,74,130 పుస్తకాలు వచ్చాయి. మిగిలిన 59 వేల పుస్తకాలు రావాల్సి ఉంది. కాగా, ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన ప్రింటింగ్ పుస్తకాలు దాదాపుగా అన్ని రాగా, ప్రభుత్వం ముద్రించనున్న పుస్తకాలు మాత్రం రావాల్సి ఉంది. 4వ తరగతి తెలుగు, 8వ తరగతి హిందీ పుస్తకాలతో పాటు 9, 10 తరగతులకు సంబంధించిన పర్యావరణం పుస్తకాలు రావలసి ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన పుస్తకాలు రెండు మూడు రోజుల్లో రానున్నట్లు సమాచారం. ఉచిత పాఠ్య పుస్తకాలు రెండు రోజుల క్రితమే జిల్లా నుంచి ఎమ్మార్సీ కార్యాలయాలకు వచ్చాయి. పాఠ్య పుస్తకాల పంపిణీని సోమవారం ప్రారంభించారు. ఉదయం ఎమ్మార్సీ కార్యాలయాలకు వచ్చిన పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు ఎంఈఓలు, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు, సీఆర్పీలు పంపిణీ చేశారు. పాఠశాలలు జూన్ 12న ప్రారంభం కానున్నందున అదే రోజు విద్యార్థులకు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం మీద గత ఏడాది కంటే ఈ ఏడాది పుస్తకాల పంపిణీ ముందే కావడంతో విద్యార్థులకు ఇబ్బందులు దూరం కానున్నాయి.
92 శాతం పుస్తకాలొచ్చాయి
జిల్లాకు 92శాతం మేర ఉచిత పాఠ్య పుస్తకాలు వచ్చాయి. మిగిలిన పుస్తకాలు రెండు మూడు రోజుల్లో వస్తాయి. వచ్చిన పుస్తకాలను ఉపాధ్యాయులకు పంపిణీ చేస్తున్నాం. పంపిణీ చేసిన పుస్తకాలను జూన్ 12న విద్యార్థులకు అందిస్తాం.
వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి

ఉచిత పాఠ్యపుస్తకాలు సిద్ధం