
జూన్ ఫీవర్
సాగు ఖర్చూ తడిసి మోపెడు..
ఉమ్మడి జిల్లాలో సుమారు 6,10,102 మంది రైతులు దాదాపు 12,82,207 ఎకరాల్లో వానాకాలం పంటలు పండిస్తారని అధికారులు అంచనా వేశారు. తొలకరితో పెట్టుబడి సమయం అసన్నమైంది. భూములను చదునుచేసి, దుక్కిదున్ని, విత్తనాలు, ఎరువులకు పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. పెరిగిన యాంత్రీకరణ, ఎరువులు, విత్తనాల ధరలు, కూలీల కొరత రైతులను ఏటా వేధిస్తూనే ఉన్నాయి. దీనికితోడు అకాల వర్షాలు, చీడపీడలతో దిగుబడి తగ్గి అన్నదాతలు అప్పుల్లో ఊబీలో చిక్కుకుంటున్నారు. సాగులో ఖర్చు తగ్గించుకునేందుకు విత్తనాలు సొంతగా తయారు చేసుకోవడం, ఆధునిక సాంకేతికను వినియోగించుకోవడం ద్వారా ఆదాయం పెంచుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయినా, పిల్లల చదువులు, వ్యవసాయ పెట్టుబడులు, సీజనల్ వ్యాధులతో ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.
సాక్షి, పెద్దపల్లి:
వేసవి సెలవుల్లో ఆటాపాలతో ఆనందంగా గడిపిన విద్యార్థులు.. పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.. ఇదేసమయంలో తొలకరితో ఎరువులు, విత్తనాల కొనుగోలు తదితర ఖర్చులతో సామాన్యులు ‘అమ్మో.. జూన్’ అని ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు వానలతో మారుతున్న వాతావరణ పరిస్థితులతో సీజనల్ వ్యాధుల ప్రబలే అవకాశం.. ఇలా అన్ని రకాల ఖర్చులు ఈనెలలో రానుండటంతో ఎలా గడపాలో తెలియక ప్రజలు తికమకపడుతున్నారు. జూన్ నెల పేద, మధ్యతరగతి కుటుంబాల్లో వణుకు పుట్టిస్తోంది.
పెన్సిల్ నుంచి పుస్తకాల వరకూ మోతే
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 938 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా అందులో సుమారు 2,26,829 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం అంటేనే ఫీజులు, పుస్తకాలు, నోట్బుక్సులతోపాటు, వాటిని భద్రపరుచుకునేందుకు బ్యాగులు, లంచ్ బాక్స్లు, పెన్నులు, పెన్సిళ్లు, టైబెల్టులు, యూనిఫామ్స్.. ఇలా ఒఒక్కటేమిటి.. రకరకాల వస్తువులు ఆయా పాఠశాల్లోనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. దీంతో యాజమాన్యాలు చెప్పిన ధర చెల్లించలేక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఇంటర్ కాలేజీల్లో సైతం ఏసీ క్యాంపస్లు, నాణ్యమైన విద్యాబోధన పేరిట రూ.లక్షల్లో ఫీజు వసూలు చేస్తుండడంతో ఆర్థికభారమైనా.. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ కోసం అప్పు లు తెచ్చిమరీ చెల్లిస్తున్నారు. స్టేట్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర బోర్డుల పేరిట నర్సరీ చదువులకే రూ.30వేలకుపైగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజుల దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నా.. పర్యవేక్షణ, నియంత్రణ మచ్చుకై నా కనిపించడం లేదు.
భయపెడుతున్న వైరల్ ఫీవర్
ఒకసీజన్ నుంచి మరోసీజన్లోకి ప్రవేశించేటప్పుడు వాతావారణం చల్లబడి వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరాల తీవ్రత ఉంటుంది. దోమల బెడత పెరిగి ప్రతీ పదిమందిలో నలుగురికి జ్వరం, గొంతునొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతో వైద్యం కోసం తరచూ ఆస్పత్రులకు వెళ్లేపరిస్థితి నెలకొని ఉంటోంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో సీజనల్ వ్యాధుల ప్రభావం అధికంగా ఉంటుంది. దీంతో ఏటా జూన్, జూలైలో జ్వరాలతో ఆస్పత్రుల పాలై జేబులు గుల్లచేసుకునే వారు అధికంగానే ఉన్నారు. ఓపీ, టెస్టుల పేరిట ఆస్పత్రుల యాజమాన్యాలు పిండిపిప్పి చేస్తుండటంతో ఈవానాకాల అంటేనే జనాలు భయపడుతున్నారు. వ్యాధుల బారిన పడిన తర్వాత వైద్యఖర్చులకు భయపడడం కన్నా.. ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో డబ్బు ఆదాతోపాటు టెన్షన్ ఉండదని నిపుణులు అంటున్నారు.
చదువుల ఫీజులు.. సాగు పెట్టుబడులు.. సీజనల్ వ్యాధులు
అన్ని ఖర్చులూ ఒకే నెలలో రావడంతో సర్వత్రా ఆందోళన
ఆర్థికభారంతో హడలెత్తిపోతున్న సామాన్య ప్రజలు
పెట్టుబడులు పెరిగాయ్
వ్యవసాయం రోజురోజుకూ భారంగా మారుతంది. పెరిగిన ఖర్చులతో సాగు చేయడం కష్టంగా మారింది. ఎరువులు, విత్తనాల ధరలు, కూలీల రేట్లు పెరుగుదలలో పోటీపడుతున్నాయి. సాగు సీజన్ వచ్చిందంటే హడలెత్తిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
– మహేశ్గౌడ్, రైతు
జూన్ అంటేనే భయం
నాకు ఇద్దరు పిల్లలు. ఒకరు యూకేజీ, మరొకరు సెకండ్ క్లాస్. జూన్ వచ్చిందంటే అడ్మిషన్లు, పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్ల కోసం భారీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికితోడు ప్రైవేట్ పాఠశాలలు ఏటా ఫీజులు పెంచుతూ మరింత ఆర్థిక భారం మోపుతున్నాయి.
– రాదాసు శైలజ, గృహిణి

జూన్ ఫీవర్

జూన్ ఫీవర్

జూన్ ఫీవర్