
ఐటీఐ విద్య.. ఉపాధిబాట
● పారిశ్రమికవిద్యతో ఉపాధి అవకాశాలు ● అందుబాటులో ప్రభుత్వ ఐటీఐ ● ప్రారంభమైన ప్రవేశాలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఆసక్తి ఉంటే చాలు.. ఐటీఐ శిక్షణతో చిన్నవయసులోనే ఉద్యోగాలు సాధించవచ్చు. సొంతంగా వర్క్షాపలు పెట్టుకొని ఇతరులకు ఉపాధి కల్పించవచ్చు. డీగ్రీలు..పీజీలు చదువకుండానే పోటీ ప్రపంచంలో తక్కువ సమయంలోనే ఉద్యోగ, ఉపాధి మార్గాలు చూపుతుంది ఐటీఐ(పారిశ్రామిక శిక్షణ సంస్థ). పదోతరగతి అర్హతతో రెండేళ్లు ఐటీఐ పూర్తిచేసి మరో ఏడాది గౌరవ వేతనంతో కూడిన అప్రెంటీస్షిప్ పూర్తిచేస్తే చాలు ఉద్యోగం సాధించినట్లే. ఐటీఐ పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. పదోతరగతి పూర్తయిన వారు https://iti.telangana. gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
జిల్లాలో ప్రభుత్వ ఐటీఐ
జిల్లా విద్యార్థులు ఒకప్పుడు ఐటీఐ విద్య కోసం పెద్దపల్లి వంటి దూరప్రాంతానికి వెళ్లేవారు. కానీ ఇప్పుడు జిల్లాలోనే ప్రభుత్వ ఐటీఐ ఉంది. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో రూ.7.77కోట్లతో ఐటీఐని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అధునాతన భవనం, నిష్ణాతులైన అధ్యాపకులు అందుబాటులో ఉన్నారు. మండెపల్లి ప్రభుత్వ ఐటీఐలో ప్రస్తుతం ఆరు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్, వెల్డర్, మోటార్ మెకానిక్ వెహికల్, డీజిల్ మెకానిక్, సీవోపీఏ కోర్సులు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరికొన్ని కోర్సులు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఆర్టిఫిషియల్ యూజింగ్ అడ్వాన్స్ టూల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, మెకానిక్ ఎలక్ట్రానిక్స్ వెహికల్, బేసిక్ డిజైన్ వర్చువల్ వెరిఫయర్ వంటి అధునాతన కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.
అవకాశాలు మెండు
సింగరేణి బొగ్గు గనులు, ఎన్టీపీసీ రామగుండం, టీఎస్ ఎన్పీడీసీఎల్, టీస్ ఎస్పీడీసీఎల్, రైల్వే, ఆర్టీసీ, బీహెచ్ఈఎల్, డీఆర్డీవో, ఇస్త్రో వంటి ప్రభుత్వ రంగసంస్థలతోపాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ వంటి రక్షణ రంగాల్లో ఐటీఐ చదివిన వారికి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ప్రైవేటు పారిశ్రామికరంగంలోనూ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇటీవల తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ(టామ్కామ్) ద్వారా ఐటీఐ విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాలు సాధించారు.
వచ్చే విద్యాసంవత్సరంలో ఏటీసీ
ప్రస్తుతం ప్రభుత్వ ఐటీఐలో ఏడు కోర్సులు అందుబాటులో ఉన్నా యి. ఐటీఐ ప్రాంగణంలోనే ఏటీసీ నిర్మాణం కూడా పూర్తయ్యింది. రాబోయే విద్యా సంవత్సరంలో మరిన్ని అధునాతన కోర్సులు అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం ఐటీఐలో ప్రవేశాలు ఆన్లైన్ ద్వారా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– ఎస్.కవిత, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్

ఐటీఐ విద్య.. ఉపాధిబాట