
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
సిరిసిల్ల: జిల్లాలో అన్నదాతలు రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు సాధించారు. గతంలో ఎన్న డూ లేని విధంగా 2,73,636.604 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఫలితంగా రైతులకు రూ.724.84కోట్లు చేతికి అందాయి. జిల్లాలో రెండు నెలలపాటు సేకరించిన ధాన్యానికి సంబంధించి రూ.6కోట్ల కమీషన్ మహిళా సంఘాలకు జమవుతున్నాయి. ఈ సీజన్ మహిళా సంఘాలకు ఆర్థికంగా కలిసివచ్చింది. జిల్లా వ్యాప్తంగా 243 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా.. ఇందులో 190 కేంద్రాలను మహిళా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చొరవతో ఏర్పాటయ్యాయి.
రూ.470కోట్ల విలువైన వడ్లు సేకరించిన మహిళలు
జిల్లాలో 190 వడ్ల కొనుగోలు కేంద్రాలను ఇందిరా మహిళా శక్తి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రూ.470 కోట్ల విలువైన 2.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 32,556 రైతుల నుంచి సేకరించగా.. 32,087 మంది ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. మిగతా వారికి త్వరలోనే అందనున్నాయి.
రూ.6కోట్ల కమీషన్
ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు సేకరించిన ధాన్యం ఒక క్వింటాలుకు రూ.32 కమీషన్గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన జిల్లాలోని మహిళా సంఘాలకు రూ.6కోట్ల కమీషన్ రానుంది. కలెక్టర్ సందీప్కుమార్ ఝా చొరవతో జిల్లాలో మహిళా సంఘాలు రూ.6 కోట్ల వడ్ల కమీషన్ దక్కనుంది. ప్రభుత్వ, ప్రైవేటు కొనుగోళ్లతో జిల్లా రైతులకు రూ.724.84కోట్ల శ్రమఫలం దక్కనుంది.
నేడు మహిళా సంఘాల సమావేశం
కలెక్టరేట్లో సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక సమావేశాన్ని డీఆర్డీఏ అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో చాలాకాలం తరువాత 190 మహిళా శక్తి సంఘాలకు ధాన్యం కొనుగోలు చేసే అవకాశాన్ని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కల్పించారు. కలెక్టర్ చొరవతో జిల్లాలోని మహిళా సంఘాలకు రూ.6కోట్ల కమీషన్ రానుంది. ఈ నేపథ్యంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ను డీఆర్డీఏ అధికారులు సన్మానిస్తున్నారు. ఈమేరకు మహిళా సంఘాలకు కలెక్టరేట్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
జిల్లాలో ముగిసిన కొనుగోళ్లు రైతుల శ్రమఫలం రూ.724.84కోట్లు 2,73,636.604 మెట్రిక్ టన్నులు సేకరణ ప్రైవేటుగా 4,310.344 మెట్రిక్ టన్నులు సేకరణ మహిళా సంఘాలకు రూ.6కోట్ల కమీషన్ జమ నేడు కలెక్టర్ను సన్మానించనున్న మహిళా సంఘాలు
ధాన్యం కొనుగోళ్లు ఇలా..
కొనుగోలు కేంద్రాలు : 246
మూసివేసిన కేంద్రాలు : 243
కొనుగోలు చేసిన ధాన్యం : 2,69,326.260 మెట్రిక్ టన్నులు
ధాన్యం విలువ : రూ.624.84 కోట్లు
వడ్లు అమ్మిన రైతులు : 42,119
డబ్బులు పొందిన రైతులు : 41,511
జమయిన డబ్బులు : రూ.543.86 కోట్లు