
జగనన్న పోరుబాట విజయవంతం చేద్దాం
● మాజీ మంత్రి మేరుగు నాగార్జున
మద్దిపాడు: పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు ఈనెల 11న పొదిలి రానున్న వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు ఇన్చార్జి మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఏ పంట సాగు చేసినా రైతులకు గిట్టుబాటు ధర అందక నష్టాలే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరి సాగు చేసిన రైతులు ఊరి వేసుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మిర్చి రైతుల గోడు వినే వారే కరువయ్యారన్నారు. పొగాకు సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధరలు లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని విశ్వసించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హయాంలో పొగాకు రైతులను ఆదుకునేందుకు రూ.118 కోట్లు వెచ్చించి మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయించారని గుర్తు చేశారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థీరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు ఏ పంట వేసినా మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఏనాడు రైతుల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించిన దాఖలాలు లేవన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్వింటా రూ.36 వేల పైచిలుకు పలికితే నాడు రూ.20 వేలకు కూడా కొనే పరిస్థితి లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలు తెలుసుకునేందుకు వేలం కేంద్రాలకు వెళ్లి పరామర్శిస్తే..ఆ మరుసటి రోజే ఇద్దరు మంత్రులు వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పి వెళ్లిపోయారని మండిపడ్డారు. మార్క్ఫెడ్ ద్వారా వైట్బర్లీ, బ్లాక్ బర్లీ కొనుగోలు చేయిస్తామని చెప్పి పది రోజులు దాటినా ఇప్పటికీ పత్తా లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి మార్క్ఫెడ్ను రంగంలోకి దించి పొగాకును కొనుగోలు చేయాలని, లేకుంటే రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని మండిపడ్డారు. రైతులకు అండగా ఈ నెల 11న పొదిలి రానున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పోలవరపు శ్రీమన్నారాయణ, దుంపా చెంచిరెడ్డి, వాకా కోటిరెడ్డి, పమిడి వెంకటేశ్వర్లు జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు ఎంపీపీలు నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి, వాకా అరుణ కోటిరెడ్డి, బుడంగుంట విజయ, యద్దనపూడి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పోలినేని కోటేశ్వరరావు, కందుల డానియల్ పల్లపాటి అన్వేష్, దుంపా రమణమ్మ, బొమ్మల రామాంజనేయులు, గుడ్డపాతల రవి, బెజవాడ రాము, మద్దా లక్ష్మీనారాయణ, బుడంగుంట నాగేశ్వరరావు, నాదెండ్ల మహేష్, పైనం ప్రభాకర్, చీదర్ల శేషు, శ్రీలల సురేష్, కంకణాల సురేష్, గండు హరిబాబు, అక్కి సాంబశివరావు, నాయిపాను ప్రవీణ్, ఎం రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.