
పొగాకు రైతులను విస్మరించిన కూటమి
యర్రంవారిపాలెం (కారంచేడు): ఈ ఏడాది పొగాకు సాగుచేసిన రైతన్నలను కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం బాపట్ల జిల్లా కారంచేడు మండలంలోని యర్రంవారిపాలెంలో స్థానిక పొగాకు రైతులు ఆయనను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం విలేకర్లతో బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు, అద్దంకి నియోజకవర్గాలతో పాటు సంతనూతలపాడు నియోజకవర్గంలో కొంత మేర బ్లాక్ బర్లీ, దొర పొగాకు సాగుచేశారన్నారు. ప్రస్తుతం పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గిట్టుబాటు ధరలు లేక, కొనే నాథుడు లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలే శరణ్యమన్నట్లుగా జీవిస్తున్నారని తెలిపారు. పొగాకు సాగు చేసిన రైతుల్లో ఎక్కువ శాతం కౌలు రైతులేనన్నారు.
వైఎస్ జగన్ స్టేట్మెంట్తో మంత్రుల బృందం హడావిడి...
పొగాకు రైతుల పక్షాన పోరాడతానని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో అప్పటికప్పుడు ఆఘమేఘాల మీద మంత్రుల బృందం పర్యటించి హడావిడి చేసిందని బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. పొగాకు కొనుగోలు చేస్తామని ప్రకటించినప్పటికీ మాటలకే పరిమితమైందని తెలిపారు. నెలవుతున్నా ఇంత వరకు పొగాకు రైతుల కన్నీరు తుడవలేకపోయారన్నారు. 89 మెట్రిక్ టన్నుల దిగుబడులు వస్తే.. ఇప్పటికి కేవలం 25 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి పట్టీపట్టనట్లు దోబూచులాడుతున్నారన్నారు. మే 28వ తేదీ పొగాకు రైతులను ఆదుకునేలా పొదిలి రావాల్సిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక వర్షాల వలన రాలేకపోయారన్నారు. నాలుగైదు రోజుల్లో ఆయన వస్తారన్నారు. ఏప్రిల్ 29వ తేదీ లాం ఫాంలో వ్యవసాయ శాఖామంత్రి అచ్చన్నాయుడు 10 రోజుల్లో పొగాకు కొనుగోలు చేయిస్తానని చెప్పారని, ప్రస్తుతం నెలరోజులు దాటినా కొనుగోళ్లలో చలనం కనిపించడం లేదని విమర్శించారు. పొగాకు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడానన్న సీఎం చంద్రబాబు మాటల్లో నిజాయితీ లేదన్నారు. గత సంవత్సరం ప్రముఖ జీపీఐ పొగాకు కంపెనీ 40 నుంచి 50 వేల మిలియన్ కిలోల నల్ల బర్లీ పొగాకు కొనుగోలు చేయడమే కాకుండా ఈ సంవత్సరం కూడా తమ ప్రతినిధులతో రైతులను పొగాకు సాగు చేయమని ప్రోత్సహించడం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఐటీసీ కంపెనీ గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కొనుగోలు చేస్తామని చెప్పి పోలిశెట్టి సోమసుందరం, తదితర కంపెనీల ప్రతినిధులు ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం అన్యాయమన్నారు. వీరంతా కుమ్మకై ్క ధరలు రాకుండా తొక్కి పట్టి రైతులను దీవాళా తీయించాలని చూస్తున్నారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న తంతు చూస్తే పొగాకు కంపెనీలన్నీ కొనుగోలు చేసినా 25 శాతం మాత్రమేనని, మిగిలిన పొగాకు పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునేంత వరకు ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించకుండా వెంటనే బర్లీని మొత్తం కొనుగోలు చేయాలని బత్తుల డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో తడిచిన పొగాకును కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.30 వేల నుంచి రూ.36 వేల వరకు ధరలు వెచ్చించి పొగాకు కొనుగోలు చేసిందన్నారు. గత ప్రభుత్వంలో రైతు స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లను మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న పొగాకును మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. బత్తుల బ్రహ్మానందరెడ్డి వెంట యర్రం లక్ష్మారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ పోలూరి శివారెడ్డి, భవనం రాజగోపాల్రెడ్డి, భవనం వెంకటేశ్వరరెడ్డి, మనుబోతు వెంకటరెడ్డి, గుదిబండి అంజిరెడ్డి, పమ్మి వెంకటరెడ్డి, స్థానిక రైతులు ఉన్నారు.
పంట కొనుగోలు చేస్తామని మాటలతో
సరిపెట్టారు
కల్లబొల్లి కబుర్లతో రైతులను సీఎం
చంద్రబాబు మోసం చేస్తున్నారు
ఇప్పటికై నా మద్దతు ధరకు పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి
వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్
పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి