
నేటి నుంచి డీఎస్సీ
ఒంగోలు సిటీ/ఒంగోలు సబర్బన్:
టీచర్ల ఉద్యోగాల కోసం నిర్వహించే డీఎస్సీ పరీక్షకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రెండు షిప్టుల్లో జరిగే ఈ పరీక్షలు ఈ నెల 30వ తేదీ వరకూ జరుగుతాయి. ఉదయం 9:30 నుంచి 12:00 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి 5:00 గంటల వరకు రెండో సెషన్ జరుగుతుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో 629 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. 24,659 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందులో మొదటి సెషన్కు 12,939 మంది, రెండో సెషన్లో 10,968 మంది, 24వ తేదీ నిర్వహించే మోడల్ స్కూలుకు సంబంధించి నిర్వహించే ఇంగ్లిష్ పరీక్షకు 752 మంది హాజరవుతున్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎనిమిది మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లను, రెండు ఫ్లయింగ్ స్వ్కాడ్లను ఏర్పాటు చేసినట్టు డీఈఓ ఏ అరుణ్కుమార్ తెలిపారు.
పకడ్బందీగా పరీక్షలు...
జిల్లాలో 2025 మెగా డీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఆ మేరకు స్థానిక ప్రకాశం భవన్లోని కలెక్టర్ చాంబర్లో గురువారం డిపార్ట్మెంటల్ అండ్ పరీక్ష కేంద్రాల లైజనింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ రూంలో నలుగురు అధికారులు నిరంతరం విధులు నిర్వర్తిస్తారన్నారు. ఎస్కే మదార్ బీ (జూనియర్ అసిస్టెంట్, 9441991757), సీహెచ్ నవ్య (జూనియర్ అసిస్టెంట్, 8977690457), నవ్య రోహిణి (జూనియర్ అసిస్టెంట్, 7989416703), ఎస్.హర్షిణి (అనలిస్ట్, 7416109602)ని సంప్రదించాలన్నారు. రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఒంగోలులో ఆరు కేంద్రాలు, మార్కాపురంలో రెండు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒంగోలులో పేస్ ఇంజినీరింగ్ కాలేజీ, రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలలో రెండు సెంటర్లు, క్విస్ ఇంజినీరింగ్ కాలేజీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ద చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియాలో, బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్లో, మార్కాపురంలోని డాక్టర్ శామ్యూల్ జార్జ్ ఇంజినీరింగ్ కాలేజీలో, మార్కాపురం దేవరాజుగట్టు వద్ద ఉన్న కృష్ణచైతన్య ఇంజినీరింగ్ కాలేజీలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి గంటా 30 నిమిషాలు ముందుగా పరీక్ష కేంద్రానికి హాజరుకావాలని సూచించారు. సెల్ ఫోన్లు, జామెంట్రీ బాక్సులు, బ్యాగులు, ఎలక్ట్రానిక్ డివైజ్లను అనుమతించమని తెలిపారు. సమావేశంలో డీఈఓ ఎ.కిరణ్ కుమార్, సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
729 పోస్టులకు 24,659 మంది అభ్యర్థులు ఎనిమిది కేంద్రాల్లో రెండు షిప్టుల్లో నిర్వహణ ప్రకాశం భవన్లో కమాండ్ కంట్రోల్ రూమ్ పకడ్బందీగా పరీక్షలు : కలెక్టర్ తమీమ్ అన్సారియా

నేటి నుంచి డీఎస్సీ