
కూటమి వైఫల్యాలపై ప్రజా పోరాటం
కనిగిరిరూరల్: కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలపై పార్టీ శ్రేణులు పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వై.రవీంద్రబాబు పిలుపునిచ్చారు. కనిగిరిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు సంపాదనే ధ్యేయంగా ఇసుక, ప్రభుత్వ, అసైన్డ్ భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కులం, మతం పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ యాసీన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా గ్రామ స్థాయి నుంచి ప్రజా ఉద్యమాలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలన్నారు. ఈనెల 21, 22న దర్శిలో నిర్వహించనున్న సీపీఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు వజ్రాల సుబ్బారావు, ఎస్కే మౌలాలి, పందిటి మోహన్,జీపీ రామారావు, పోతుల ప్రభాకర్, పాలపర్తి మస్తాన్రావు, పుట్టా సుబ్బారావు, ఖాశింపీరా, సయ్యద్ మౌలాలి(ఆర్ట్), ఎస్డీ ఖాదర్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు
వై.రవీంద్రబాబు