బడుగులపైనా పోలీసుల దౌర్జన్యం..? | - | Sakshi
Sakshi News home page

బడుగులపైనా పోలీసుల దౌర్జన్యం..?

Jun 4 2025 1:47 AM | Updated on Jun 4 2025 2:08 AM

బడుగులపైనా పోలీసుల దౌర్జన్యం..?

బడుగులపైనా పోలీసుల దౌర్జన్యం..?

సింగరాయకొండ: రాష్ట్రంలో తెనాలి ఘటన మరవకముందే కొండపి మండలం జాళ్లపాలెంలో మహిళలపై ఎస్సై దౌర్జన్యం చూస్తుంటే కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులను హరిస్తుందని వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జాళ్లపాలెం ఘటనలో ఎస్సై రమేష్‌బాబు సీసీ ఫుటేజీ కోసం దుకాణంలోని మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, ఇంట్లోకి బలవంతంగా వెళ్లి హార్డ్‌డిస్క్‌, సెల్‌ఫోన్‌, పెన్‌డ్రైవ్‌లు బలవంతంగా తీసుకెళ్లారన్నారు. బాధిత మహిళలకు న్యాయం చేయాల్సింది పోయి వీరిపైనే కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు ఈ విధంగా చట్టాన్ని, రాజ్యాంగ హక్కులను కాలరాయడం హేయమైనచర్యగా అభివర్ణించారు. ఈ ఘటనలో ఎటువంటి రాజకీయానికి తావు లేదని, కానీ మంత్రి స్వామి మాత్రం ఈ ఘటనను రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. పట్టపగలు ఎస్సై రమేష్‌బాబు మహిళలపై దౌర్జన్యం చేస్తే మంత్రి స్వామి కులం పేరుతో వైఎస్సార్‌ సీపీపై అభాండాలు వేస్తున్నారన్నారు.

కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై 766 హత్యాయత్నాలు, హత్యలు జరిగాయని, 390 మంది నాయకులు, కార్యకర్తలు హత్యకు గురయ్యారన్నారు. సుమారు 2,466 మందిపై అక్రమ కేసులు బనాయించారని, 500 మందిని జైలుకు పంపారని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకు సోషల్‌మీడియా యాక్టివిస్టులపై 440 కేసులు బనాయించి 79 మందిని జైలుకు పంపారన్నారు. జాళ్లపాలెం ఘటనలో రౌడీషీటర్‌ ఉన్నాడని, మహిళ ఎస్సైపై దాడి చేసిందని మంత్రి స్వామి ఆరోపిస్తున్నాడని, మంత్రి అనే వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని హితవుపలికారు. షాపు యజమాని కొండలరావుకు వాటర్‌ప్లాంట్‌ ఉంటే టీడీపీ శ్రేణులు జేసీబీ తీసుకువచ్చి ధ్వంసం చేసి సామానులు వాగులో పడేశారని, దీనిపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. జగ్గరాజుపాలెం పెట్రోల్‌బంకు వద్ద దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. జాళ్లపాలెం ఘటనలో బాఽధితులతో జగనన్న మాట్లాడతాడనే సరికి హడావుడిగా బాధితులపైనే కేసులు నమోదు చేశారన్నారు. ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌, మానవ హక్కుల కమిషన్‌, మహిళా కమిషన్‌ న్యాయం చేయాలని కోరారు. కొండపి మండలం పెట్లూరులో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు కల్లూరి చంద్రమౌళికి చెందిన 3.5 ఎకరాల బొప్పాయి తోటను ధ్వంసం చేశారని, రూ.20 లక్షల విలువైన పంటను ధ్వంసం చేసినా ఎటువంటి చర్యలు లేవన్నారు. కేసుల విషయంలో హోంమంత్రి కులం ప్రస్తావన వద్దంటే, మంత్రి స్వామి మత్రం కుల ప్రస్తావన తీసుకువస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో బలహీన వర్గాల వారిపై ఎన్నో దాడులు జరిగాయని, కానీ చర్యలు లేవని మండిపడ్డారు.

వెన్నుపోటు దినం జయప్రదం చేయండి

ఏడాది పాలనలో ఒక్క హామీని అమలు చేయని కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ బుధవారం ఉదయం 10 గంటలకు కొండపిలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ సుల్తాన్‌, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు యనమల మాధవి, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు చుక్కా కిరణ్‌కుమార్‌, వాణిజ్య విభాగం అధ్యక్షుడు గాదంశెటి గుప్తా, సోమిశెట్టి సురేష్‌, షేక్‌ కరీం, కోమట్ల వెంకారెడ్డి, మిడసల అశోక్‌, పి శ్రీనివాసులరెడ్డి, షేక్‌ అబ్దుల్లా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజల హక్కులు హరిస్తున్న కూటమి ప్రభుత్వం

జాళ్లపాలెం ఘటనను వక్రీకరిస్తున్న మంత్రి స్వామి, ఎస్పీ దామోదర్‌

విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement