
జిల్లాలో బాల అదాలత్లు ఏర్పాటు చేయాలి
ఒంగోలు సబర్బన్: జిల్లాలో బాల పంచాయతీలు (బాల అదాలత్) ఏర్పాటు చేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి కోరారు. ఈ మేరకు కమిషన్ సభ్యురాలు పద్మావతి..కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాను సోమవారం ఆమె ఛాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు కొన్ని సూచనలు చేశారు. జిల్లాలోని బాల బాలికల సమస్యలను కమిషన్ సభ్యురాలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పశ్చిమ ప్రకాశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఎంఎస్కేలు క్షేత్రస్థాయిలో పిల్లలతో మమేకమై పని చేయాలని సూచించారు. స్కూల్స్ జూన్ 12 నుంచి పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఫీజుల జాబితాలను ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యం నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించాలని కలెక్టర్కు సూచించారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు కూడా 25 శాతం ఉచితంగా సీట్లు ప్రైవేటు స్కూళ్లలో చోటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు సంబంధించి డీఈఓ కార్యాలయ అధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థినులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఆడపిల్లలకు హెచ్బీ శాతం ప్రతినెలా చెక్ చేయాలని కలెక్టర్కు సూచించారు. ఏపీఆర్జేసీ అండ్ గురుకులం పాఠశాలల్లో చిన్నారులపై వేధింపులు లేకుండా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చారు. ఆయా స్కూళ్లలో కంప్లెయింట్ బాక్స్లు కూడా ఏర్పాటు చేయాలన్నారు. సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి సీసీఐలలో ఉన్న పిల్లల పెండింగ్ కేసులు పూర్తి చేయాలని, తిరుపతిలోని హోంలో ఉన్న పిల్లలకు విద్యపై ఆసక్తి కలిగేలా చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో పద్మావతితో పాటు డీసీపీఓ పి.దినేష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
బాలల సమస్యలపై ఆ సమావేశాల్లో చర్చించాలి కలెక్టర్ తమీమ్ అన్సారియాకు సూచించిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు పద్మావతి