
చోరీ కేసులో సొత్తు రికవరీ
సంతనూతలపాడు: మండల కేంద్రమైన సంతనూతలపాడులోని రజకవాడలో ఓ ఇంట్లో గత నెల 31వ తేదీ రాత్రి చోరీ అయిన సొత్తును పోలీసులు రికవరీ చేశారు. రజకవాడకు చెందిన మోహన్ అనే వ్యక్తి గృహంలోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి 25 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. 10 గ్రాముల బంగారు బ్రాస్లెట్, నాలుగు గ్రాముల బంగారు ఉంగరం, ఆరు గ్రాముల బంగారు బుట్ట కమ్మలు, నాలుగు గ్రాముల బంగారు కమ్మలు చోరీకి గురైనట్టు బాధితుడు ఫిర్యాదు చేయగా హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ ఉదయ్కుమార్ కేసు నమోదు చేశారు. ఒంగోలు రూరల్ సీఐ ఎన్.శ్రీకాంత్ బాబు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టిన సంతనూతలపాడు పోలీసులు తాళ్లూరు మండలం శివరాంపురం గ్రామానికి చెందిన పొదిలి బ్రహ్మయ్యను నిందితుడిగా గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం సంతనూతలపాడు బస్టాండ్ సెంటర్లో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని చోరీ అయిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభచాటిన హెడ్ కానిస్టేబుల్ ఉదయ్ కుమార్, కానిస్టేబుళ్లు నారాయణరెడ్డి, నాగార్జునను డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శ్రీకాంత్బాబు అభినందించారు.