
జీవితాలు కూల్చి!
సంపద సృష్టిస్తాం.. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం.. లేనిపక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఎన్నికలప్పుడు కూటమి నేతలు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే చిరుద్యోగులపై కక్షగట్టారు. వారు చేస్తున్న ఉద్యోగాలను నిర్దాక్షణ్యంగా ఊడగొట్టి రోడ్డున పడేశారు. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు.. ఏళ్ల తరబడి పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్లు, ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, హెల్పర్లు, పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేసే కార్మికులు, నైట్ వాచ్మెన్లు.. ఇలా జిల్లాలో సుమారు 18 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించి వారి పొట్టగొట్టారు.
హామీల బూచి..
చిరుద్యోగుల పొట్టకొట్టి...
మద్యం దుకాణాల్లో సూపర్వైజర్లు 178
మద్యం దుకాణాల్లో సేల్స్మెన్లు 356
మధ్యాహ్న భోజన పథకం కార్మికులు 3000
వైద్యశాలల్లో పనిచేసిన పారిశుధ్య సిబ్బంది 180
ఒంగోలు నగరంలో మేసీ్త్రల సంఖ్య 45
ఒంగోలు నగరంలో పారిశుధ్య కార్మికులు 23
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఖ్య 650
డ్వాక్రా వీఓఏలు 700
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రజలకు జీవనోపాధి చూపించాల్సిన ప్రభుత్వం రాజకీయ కారణాలతో వివిధ శాఖలకు చెందిన చిరుద్యోగులను తొలగించి వారి కుటుంబాలకు నిలువ నీడ లేకుండా చేసింది. ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న వారిని కూడా తొలగించి ఒంగోలులోని కలెక్టరేట్ ఎదురుగా నిరసన ప్రదర్శనలకు దిగినా పట్టించుకోలేదు. దీన్నిబట్టి కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చని ప్రజాసంఘాల నాయకులు మండిపడుతున్నారు.
వలంటీర్లను వంచించి...
అధికారంలోకి వస్తే రూ.10 వేలు ఇస్తామని, ప్రస్తుతం పనిచేస్తున్న వలంటీర్లను కొనసాగిస్తామని గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం జిల్లాలో పనిచేస్తున్న 12,489 మంది వలంటీర్లను కూటమి ప్రభుత్వం పీకేసింది. అప్పటి వరకు ఇంటింటికి అందించే పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలను సైతం నిలిపివేసింది. వలంటీర్లకు బదులుగా ప్రభుత్వ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేయిస్తోంది. వలంటీర్లు వివిధ మార్గాల్లో పోరాటాలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే, చంద్రబాబు కేబినేట్లో ఉన్న మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వలంటీర్ల శాఖకు మంత్రిగా ఉండటం గమనార్హం.
కోర్టు ఉత్తర్వులు సైతం లెక్కచేయకుండా...
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 5,500 మందికిపైగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులున్నారు. వీరిలో చాలా మంది 20 ఏళ్లకుపైగా పనిచేస్తున్నారు. ప్రభుత్వాలు సకాలంలో బిల్లులు చెల్లించకపోయినప్పటికీ అప్పులు చేసి వంట వండి పిల్లలకు భోజనం పెడుతున్నారు. ఎక్కువగా ఎస్సీ, బీసీ మహిళలే పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 3 వేల మందితో బలవంతంగా రాజీనామాలు చేయించింది. అయితే, కొంత మంది అంగీకరించలేదు. ప్రజా సంఘాలతో కలిసి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో పోరాటానికి దిగారు. కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ధర్నాలు చేశారు. మరికొందరు మాత్రం న్యాయస్థానాలకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. వారిని కూటమి నేతలు వేధించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆ వేధింపులు కొనసాగుతుండటం శోచనీయం. తాజాగా ఒంగోలు నగరంలోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలిని తొలగించి తమ సొంత మనుషులను నియమించుకున్నారు. సెలవుల తర్వాత నుంచి విధులకు రావద్దని బెదిరిస్తున్నట్లు సమాచారం.
రోడ్డున పడిన పారిశుధ్య కార్మికుల కుటుంబాలు...
కూటమి అధికారంలోకి రాగానే పారిశుధ్య కార్మికులనూ వదల్లేదు. వారిపై వైఎస్సార్ సీపీ ముద్ర వేసి ఉద్యోగాల నుంచి తొలగించేసింది. ఒంగోలు నగరంలో పనిచేస్తున్న 45 మంది మేసీ్త్రలు, 23 మంది పారిశుధ్య కార్మికులను ఉన్నపళంగా తొలగించింది. స్థానిక ఎమ్మెల్యేను కలిసి మాట్లాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. రోజుల తరబడి దీక్షలు చేసినా పట్టించుకోలేదు. ఆప్కాస్ను రద్దు చేస్తామని ప్రభుత్వం చెబుతుండడంతో పారిశుధ్య కార్మికులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఆప్కాస్ను రద్దు చేస్తే కార్మికులకు వేతనాలు సక్రమంగా రావని, పీఎఫ్ చెల్లింపులు సరిగ్గా జరగవని, మొత్తం కార్మికుల ప్రాథమిక హక్కులు కాలరాసి బానిస వ్యవస్థను తయారు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని కూటమి పాలకులపై కార్మికులు మండిపడుతున్నారు. ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే పట్టణ ప్రజలకు పారిశుధ్య సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ప్రజాసంఘాలు ఆందోళన చెందుతున్నాయి.
ఫీల్డ్ అసిస్టెంట్ల ఉపాధికి దెబ్బ...
జిల్లాలోని ఉపాధి హామీ పథకంలో 729 మంది పీల్డ్ అసిస్టెంట్లు ఉండాల్సి ఉండగా, వారిలో 60 పంచాయతీలకు ఫీల్డ్ అసిస్టెంట్లు లేరు. దీంతో 650 మందికిపైగా ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే టీడీపీ నాయకులు వీరిపై దాడులు చేయడం మొదలుపెట్టారు. రేపటి నుంచి పనికి వస్తే ఊరుకోమంటూ హుకుం జారీ చేశారు.
రాజకీయంగా అధికారులపై ఒత్తిడి చేశారు. పోలీసుల ద్వారా బెదిరించారు. బలప్రయోగం చేస్తామంటూ వార్నింగులిచ్చారు. దాంతో కొందరు స్వచ్ఛందంగా ఉద్యోగం మానుకున్నారు. మరికొందరితో రాజీనామాలు చేయించారు. తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్ల స్థానంలో కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలను నియమించుకున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టులను అమ్ముకున్నట్లు ప్రచారం జరిగింది. ఏదేమైనా కూటమి పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి వారి ఉపాధిని దెబ్బకొట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో తొలగించిన ఉద్యోగుల వివరాలు...
ఏడాది పాలన
లక్షల ఉద్యోగాలంటూ ఎన్నికల ముందు చంద్రబాబు హామీ వలంటీర్లకు రెట్టింపు జీతమంటూ నిట్టనిలువునా మోసం అధికారంలోకి వచ్చీరాగానే చిరుద్యోగులపై ప్రతాపం పారిశుధ్య కార్మికులనూ వేధించిన పాలకులు మధ్యాహ్న భోజన కార్మికుల పొట్టకొట్టిన బాబు రోడ్డున పడిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు డ్వాక్రా వీఓఏలపై కూటమి కక్ష సాధింపులు
జిల్లాలో 1200 మంది డ్వాక్రా వీఓఏలు ఉన్నారు. వారిలో 700 మందిని ప్రభుత్వం తొలగించి వారికి అన్యాయం చేసింది. జిల్లాలో ఉన్న 178 ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సేల్స్మెన్లు, సూపర్వైజర్లు 534 మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఎత్తివేయడంతో వారంతా ఉద్యోగాలు కోల్పోయారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. జిల్లాలో 1,392 రేషన్ దుకాణాలు ఉన్నాయి. పచ్చకూటమి పాలనలోకి రాగానే దాదాపుగా వారందరినీ తొలగించింది. గత వైఎస్సార్ సీపీ పాలనలో వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ తెచ్చి ఇచ్చేవారు. జిల్లాలో 385 వాహనాలు ఉండగా, వాటిని కూడా తీసేసి రేషన్ దుకాణాల వద్దకే వెళ్లి తెచ్చుకోవాలని ఆదేశాలిచ్చింది. కూటమి పాలనలో ఏ ఒక్క శాఖనూ వదలకుండా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలన్నింటిలో పచ్చమందను తెచ్చిపెట్టింది.

జీవితాలు కూల్చి!