బ్యాంగ్‌! | - | Sakshi
Sakshi News home page

బ్యాంగ్‌!

May 28 2025 5:47 PM | Updated on May 29 2025 1:38 PM

బ్యాం

బ్యాంగ్‌!

బూమ్‌..
మేఘాల్లో ధన, రుణావేశం పిడుగుల జననం
 

జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు జనాన్ని ఆశ్చర్యానికి, అయోమయానికి గురిచేస్తున్నాయి. అంతకు మించి భయాన్ని పుట్టిస్తున్నాయి.! అనూహ్య రీతిలో వాతావరణం మారిపోయి, ఆకాశంలో మబ్బులు కమ్మేయడం.. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో పిడుగులు పడుతుండటంతో మనుషులతోపాటు మూగ జీవాలు బలవుతున్నాయి. పిడుగుల బారి నుంచి రక్షణ పొందాలంటే అప్రమత్తతే ఆయుధం. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న హెచ్చరికలను అనుసరించడం అత్యంత ముఖ్యం.

పొన్నలూరు/కనిగిరి రూరల్‌: వేసవి కాలం అయినప్పటికీ బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా అడపా దడపా వర్షాలు కురిశాయి. పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ క్రమంలోనే చెట్లు, నివాసాలు, ఖాళీ స్థలాలు, విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఆలయాలపై పిడుగులు పడటంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. సాధారణంగా పిడుగుపాటు బారి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే వర్షాలు కురిసే సమయాల్లో చెట్ల కింద, ఎత్తయిన ప్రదేశాలు, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉంటే ప్రాణాలు కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.

సమయ స్ఫూర్తి ఎంతో అవసరం..

వ్యవసాయ పనులు చేసేటప్పుడు ఉరుములు, మెరుపులు వస్తుంటే పిడుగులు పడతాయని భావించి రైతులు అప్రమత్తం కావాలి. వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి. ఒక వేళ సురక్షిత ప్రాంతానికి వెళ్లే సమయం లేకుంటే సమయస్ఫూర్తితో వ్యవహరించి.. మోకాళ్లపై కూర్చుని చేతులు, తల నేలకు తగిలేలా ముడుచుకుని కూర్చోవాలి. దీని వల్ల సమీపంలో పిడుగు పడినా ఆ ప్రభావం తక్కువగా ఉండి ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. అలా కుదరని పరిస్థితిలో కాళ్లను భూమి మీద పూర్తిగా ఆనించకుండా, కాలి వేళ్లపై నిల్చునేందుకు ప్రయత్నించాలి.

ఈ జాగ్రత్తలు పాటించాలి

æ సాధారణంగా ఎత్తుగా ఉండే నిర్మాణాలు, ప్రాంతాలపై పిడుగులు ఎక్కువగా పడతాయి. అందువల్ల వర్షం కురిసే సమయంలో చెట్లు, సెల్‌ టవర్లు, విద్యుత్‌ స్తంభాలు, కొండల వద్దకు వెళ్లకూడదు.

æ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, విద్యుత్‌ కుక్కర్లు, ల్యాప్‌ టాప్‌లు, స్మార్ట్‌ ఫోన్‌లు, కంప్యూటర్లు, ఇతర విద్యుత్‌ పరికరాలు ఉపయోగించకూడదు.

æ గుంపులు గుంపులుగా కాకుండా దూరంగా ఉండాలి.

ప్రథమ చికిత్స ఇలా..

● పిడుగుపాటుతో అస్వస్థతకు గురైన వారిని గాలి, వెలుతురు తగిలే విశాలమైన ప్రాంతంలో ఉంచాలి.

● తడి దుస్తులు తొలగించి పొడి దుస్తులు వేయాలి.

● తల ఒక వైపునకు తిప్పి, రెండు కాళ్లు కాస్త పైకి ఎత్తి ఉంచాలి.

● తాగు నీరు, ఆహార పదార్థాలు అందించకూడదు.

● అందుబాటులో ఉన్న వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స అందించాలి.

జిల్లాలో పిడుగుల గర్జన

ì ఏప్రిల్‌ 3న వెలిగండ్ల మండలం గుడిపాటిపల్లి పంచాయతీ కట్టకిందపల్లిలో బి.తిరుపాలుకు చెందిన సుమారు 10 జీవాలు పిడుగుపాటుకు మృతి చెందాయి.

ì ఏప్రిల్‌ 4న కొమరోలు మండలం ఎడమకల్లులో ఎం.యాకోబుకు చెందిన మూడు గేదెలు చనిపోయాయి.

ì ఏప్రిల్‌ 20న బేస్తవారిపేట మండలంలోని పెద్ద ఓబినేనిపల్లెలో క్రికెట్‌ ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు విద్యుర్థులు ఆకాష్‌, సన్ని పిడుగుపాటుతో మృత్యువాతపడ్డారు. గొర్రెల కాపరి తిరుపతయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

ì కొమరోలు మండలం తాటిచర్ల మోటులో గుమ్మళ్ల శింగరయ్యకు చెందిన రెండు గేదెలు, రెండు దూడలు పిడుగుపాటుకు చనిపోయాయి.

ì ఏప్రెల్‌ 16న అర్ధవీడు మండలం యాచవరంలో పొలంలో పనిచేస్తున్న కూలీలపై పిడుగు పడటంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ì ఏప్రిల్‌ 30న కంభంలోని హజరత్‌ గూడెంలో పిడుగుపాటుకు రెండు గేదెలు మృతిచెందాయి.

ì మే 2న కనిగిరి మండలం కలగట్ల సమీపంలో నూకపోటి శివపార్వతమ్మకు చెందిన గొర్రెల మందపై పిడుగు పడి 20 మేకలు మృత్యువాతపడ్డాయి.

ì మే 4న నాగులుప్పలపాడు మండలం ఈదుమూడికి చెందిన కొండపి నాగమల్లేశ్వరరావు పిడుగుపాటుతో మృతి చెందారు.

ì మే 16న సింగరాయకొండ మండలం బేసిన్‌ పల్లెపాలెంలో రామాలయంపై పిడుగుపడి మూడు విగ్రహాలు ధ్వంసమయ్యాయి.

ì మే 17న రాచర్ల మండలంలోని జేపీ చెరువు సమీపంలో పిడుగుపాటుకు 22 గొర్రెలు మృతి చెందాయి.

ì ఇటీవల ముండ్లమూరు మండలంలో ఓ నివాసంపై పిడుగుపడటంతో చుట్టుపక్కల 12 ఇళ్లలో గృహోపకరణాలు దెబ్బతిని రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది.

పిడుగుల ప్రతాపం ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాల్లోనే అధికం గడిచిన నెలన్నర వ్యవధిలో దాదాపు 20 వరకు పిడుగుపాట్లు మనుషులతోపాటు మూగజీవాలు మృత్యువాత గృహోపకరణాలు దగ్ధమై భారీగా నష్టం పిడుగులు పడే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న వాతవరణ శాఖ గృహాలు, కార్యాలయాలపై లైట్నింగ్‌ కండక్టర్‌ ఏర్పాటు ముఖ్యం

లైట్నింగ్‌ కండక్టర్‌తో ప్రయోజనం

30,000 డిగ్రీల ఉష్ణం గంటకు 4.34 లక్షల కి.మీ వేగం

పిడుగులు పడే సమయంలో శక్తి విస్ఫోటనం చెంది అధిక ఉష్ణోగ్రత వెలువడుతుంది. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం పిడుగు పడినపుడు 50 వేల డిగ్రీల ఫారన్‌ హీట్‌ లేదా 30 వేల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణగ్రత విడుదల అవుతుంది. సుమారు 300 మిలియన్‌ వాట్ల విద్యుత్‌ జనిస్తుంది. గంటకు 4.34 లక్షల కిలోమీటర్ల వేగంతో పిడుగు భూమికి చేరుతుంది.

విరుద్ధ విద్యుదావేశాలున్న రెండు మేఘాలు ఢీకొన్నప్పుడు వాటి మధ్య జనించే శక్తినే పిడుగు అని పిలుస్తాం. ధ్వని వేగం కన్నా కాంతి వేగం ఎక్కువ కావడంతో ముందుగా మెరుపు కనిపిస్తుంది. తర్వాత ఉరుము శబ్ధం వినిపిస్తుంది. తేమ విద్యుత్‌ ప్రవాహంగా పనిచేయడం వల్ల ధనావేశం ఉన్న విద్యుత్‌ శక్తి భూమిపై రుణావేశం గల ప్రదేశానికి క్షణాల వ్యవధిలో దూసుకొస్తుంది. పిడుగులు ఎత్తయిన ప్రదేశాలపై పడి భూమిలోకి తటస్థంగా వెళ్లిపోతాయి. సహజంగా భూమిపై చెట్లు ఎత్తుగా ఉండటం వల్ల పిడుగులు వాటిపైనే అధికంగా పడుతుంటాయి.

చెట్లకు దూరంగా ఉండాలి..

ప్రజలు వర్షం కురిసినప్పుడు చెట్ల దగ్గరకు వెళ్లకపోవడమే మంచిది. అలాగే వర్షం వచ్చేటప్పుడు సెల్‌ ఫోన్‌ వినియోగించడం కూడా మంచిది కాదు. విద్యుత్‌ను గ్రహించే వాటికి దూరంగా ఉండాలి. పిడుగుపాటుకు గురైతే వెంటనే స్పృహ కోల్పోతారు. ప్రథమ చికిత్సకు అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. పిడుగుపాటుకు గురైన వ్యక్తికి ధైర్యం చెప్పి వెంటనే వైద్యులను సంప్రదించాలి.

– డాక్టర్‌ రవికిరణ్‌, పీహెచ్‌సీ, పొన్నలూరు

పిడుగుల నుంచి రక్షణ కోసం భౌతిక శాస్త్రవేత్త బెంజిమన్‌ ప్రాంక్లిన్‌ రాగి తీగలతో లైట్నింగ్‌ కండక్టర్‌ రూపొందించారు. వీటిని ఎత్తయిన భవనాలు, గుడి గోపురాలపై అమర్చేవారు. ఈ కండక్టర్‌ పిడుగుల్లోని విద్యుదావేశాన్ని గ్రహించి రాగి తీగల ద్వారా నేరుగా భూమిలోకి పంపిస్తుంది. ఈ క్రమంలో రాగి తీగలు కూడా కరిగిపోతుంటాయి. ప్రస్తుతం రాగి, కాంస్య మిశ్రమంతో రూపొందిచిన లైట్నింగ్‌ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని కూడా ప్రజలు అవసరాన్ని బట్టి వినియోగించి పిడుగుల బారి నుంచి రక్షణ పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement