
రైతులకు కష్టాలు, కరువు
చంద్రబాబు జమానాలోనే
ఒంగోలు సిటీ: సీఎం చంద్రబాబు గద్దెనెక్కగానే రాష్ట్రంలో కరువు పరిస్థితులు, రైతులకు కష్టాలు వస్తున్నాయని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు విమర్శించారు. మంగళవారం ఒంగోలులోని జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పొగాకుకు గిట్టుబాటు ధర లేక రెండు నెలలుగా రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారని, కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన ఖరారు కాగానే సీఎం చంద్రబాబు, మంత్రుల బృందం ఆగమేఘాలపై స్పందించడాన్ని ఎండగట్టారు. అవసరమైతే మార్క్ఫెడ్ను రంగంలోకి దించుతామని సీఎం మౌఖికంగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులకు అవసరమయ్యే మార్క్ఫెడ్తో కొనుగోళ్లు చేయించాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ లేవనెత్తే వరకు రాష్ట్రంలో ఏ సమస్యలూ ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. మిర్చి ధరలు పతనమై ఇబ్బంది పడుతున్న రైతులను గుంటూరు మిర్చియార్డులో వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన తర్వాత మార్క్ఫెడ్తో కొనుగోలు చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు జీఓ ఇవ్వలేదని విమర్శించారు. రైతులు పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్డీ పెరుగుతోందని, గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని సూచించారు.
పొగాకుకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్నా ధర పడిపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రెండు నెలలు నుంచి టుబాకో బోర్డు అధికారులు సైతం రైతులకు అబద్ధాలు చెబుతూ మభ్యపెడుతున్నారని విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ మార్క్ఫెడ్ను రంగంలోకి దించడంతోపాటు పొగాకు కంపెనీలతో సమావేశం నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ను రంగంలోకి దించితే లాభాలే తప్ప నష్టాలు వచ్చే అవకాశమే లేదన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మౌనంగా ఉందంటే వ్యాపారులకు లాభాలు తెచ్చిపెట్టే ఎత్తుగడ కాక మరేమిటని నిలదీశారు. రైతులను మోసం చేస్తే చరిత్ర హీనులు కావడం ఖాయమన్నారు. పొగాకు రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతుందని, ప్రభుత్వం మెడలు వంచి గిట్టుబాటు ధర దక్కేలా చూసే బాధ్యత పార్టీ తీసుకుంటుందన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని, పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతులను గ్రూపులుగా విడదీయడం, గట్టిగా నిలదీసేవారి బేళ్లు కొనడం, పేద రైతుల బేళ్లు తిరస్కరించడం టుబాకో బోర్డు అధికారులకు సరికాదన్నారు. బోర్డు అధికారుల మీద నమ్మకం పోతే రైతులు తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరించారు.
పొగాకు ధరల పతనంపై కూటమి స్పందన శూన్యం పొగాకు రైతులకు అండగా వైఎస్సార్ సీపీ పోరాటం వైఎస్సార్ సీపీ ఒంగోలు ఇన్చార్జి చుండూరి రవిబాబు