
పొగాకు రైతులపై పచ్చపాతం
పొదిలి రూరల్: కష్టాల్లో ఉన్న పొగాకు రైతులను ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం వారిపై పచ్చపాతం చూపుతోందని, మద్దతు ధర కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ఈ నెల 28వ తేదీ ఉదయం 9.30 గంటలకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలి వస్తున్నారని తెలిపారు. జగన్ రాక కోసం హెలిప్యాడ్కు అనువైన స్థలాలను పొదిలి పట్టణంలోని దర్శి రోడ్డులో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదురెడ్డి, స్థానిక తహసీల్దారు కృష్ణారెడ్డితో కలిసి ఆదివారం చెవిరెడ్డి పరిశీలించారు. ఎస్ఎస్ఆర్ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న విశాలమైన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ పొదిలి పొగాకు వేలం కేంద్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. రైతులను ఓదార్చడం, ధైర్యం చెప్పడం, వారి భవిష్యత్ కోసం పోరాటానికి సిద్ధమవడం కోసం ఆయన వస్తున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ బాధలు చెప్పుకోవడానికి రైతులంతా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరికీ కనీస సహాయం అందలేదన్నారు. అన్నదాతలు పండించిన కంది, వరి, మిరప పంటలకు సరైన ధర లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా పొగాకు రైతుకు గత నాలుగేళ్లతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బ్యారన్, పొలం కౌలు, పెట్టుబడి బాగా పెరిగిందన్నారు. గతేడాది వచ్చిన ఆదాయంతో పోల్చుకుంటే ఈ ఏడాది రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు చూస్తే రైతులకు దిక్కుతోచడం లేదన్నారు. ఎక్కడచూసినా పొగాకు బేళ్లు అమ్ముడుపోక, పెట్టిన పెట్టుబడి రాక రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. జగనన్న ప్రభుత్వంలో వచ్చిన ధరలు ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదన్నారు. రైతుల కోసం మార్క్ఫెడ్ను రంగంలోకి దించి జగనన్న అండగా నిలిచారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లుతెరిచి రైతులకు మేలు చేయాలని కోరారు. పొగాకు పంటకు మద్దతు ధర వచ్చేంత వరకు రైతులకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందన్నారు. రైతుల పక్షాన ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు ప్రతి గ్రామం నుంచి రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కేవీ రమణారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
చీమకుర్తి: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28న పొదిలిలో తలపెట్టిన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు. చీమకుర్తిలోని బూచేపల్లి కల్యాణ మండపంలో ఆదివారం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా మాట్లాడారు. పొగాకు రైతులు తీవ్రంగా నష్టాల పాలవుతున్నా ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. రైతుల్లో మనోఽధైర్యాన్ని నింపేందుకు పొదిలికి వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, మండల రూరల్ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ గోపురపు రాజ్యలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్లు బాపతు వెంకటరెడ్డి, ఎన్.మాణిక్యం, మాజీ మున్సిపల్ చైర్మన్ చల్లా అంకులు, గోపురపు చంద్ర, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ
మద్దతు ధర కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలు తెలుసుకునేందుకే ఈ నెల 28న పొదిలికి వైఎస్ జగన్ రాక వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదురెడ్డి