
టీడీపీ వర్గీయుల బాహాబాహీ..
సాక్షి నెట్వర్క్: జరుగుమల్లి మండలంలోని కె.బిట్రగుంట గ్రామం తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ, వయోవృద్ధులు, గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయ, దివ్యాంగులు శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి గ్రామంలోని ఒట్టిగుంట శివాజీ వర్గానికి మద్దతు తెలుపుతుండగా, చిమ్మిరి బ్రహ్మయ్య వర్గానికి రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మద్దతు ఇస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో దామచర్ల సత్య, మంత్రి స్వామి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలతో వీరి మధ్య అంతర్గతంగా విభేదాలు తలెత్తినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా నియోజకవర్గంలో టీడీపీ వారు రెండు వర్గాలుగా విడిపోయారన్న దానికి కె.బిట్రగుంట ఘటనే సాక్ష్యమని ఆ పార్టీ నేతలే ధ్రువీకరిస్తున్నారు. గ్రామానికి చెందిన చిమ్మిరిబ్రహ్మయ్య సర్పంచ్ అభ్యర్థి రేసులో ఉన్నాడు. ఈయన ఆదివారం ఉదయం పశువులకు గడ్డి తీసుకుని మోటారుసైకిల్ పై ఇంటికి ె వెళుతుండగా గ్రామ సెంటర్లో టీ తాగుతున్న శివాజీ అటుగా వెళ్తున్న బ్రహ్మయ్యను ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో బ్రహ్మయ్య గడ్డి ఇంటి దగ్గర పడేసి తిరిగి వచ్చే క్రమంలో దారిలో ఒక మహిళతో శివాజీ తనను తిడుతున్నాడని చెబుతుండగా అక్కడికి వచ్చిన శివాజీ తన చేతిలోని కప్పులో ఉన్న టీని బ్రహ్మయ్య మొఖంపై పోసి కాలితో తన్నడంతో అతను మోటారుసైకిల్తో సహా కింద పడిపోయాడు. శివాజీ అంతటితో ఆగకుండా బ్రహ్మయ్యపై దాడిచేస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న మహిళ కేకలు వేయడంతో సమీపంలో ఉన్న వారు వచ్చి శివాజీని పక్కకు లాగటంతో అతను అదుపుతప్పి పడిపోయాడు. తరువాత గాయపడ్డ బ్రహ్మయ్యను 108లో ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా శివాజీ కూడా దెబ్బలు తగిలాయంటూ కొండపి ఏరియా ఆస్పత్రికి 108లో వెళ్లాడు. ఈ ఘటనలో బ్రహ్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ జరిగిన వెంటనే సింగరాయకొండ ఎస్సై బి.మహేంద్ర గ్రామానికి వచ్చి శివాజీకి బందోబస్తుగా ఉన్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శివాజీని ఎవరు గాయపరచలేదని అతనే గాయపరచుకుని రక్తం కారిన ఫొటోలు తీయించుకున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల గ్రామంలో చర్చనీయాంశంగా మారిన అంబేడ్కర్ ఊరేగింపును అడ్డుకున్న ఘటనలో బ్రహ్మయ్య వర్గీయులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కావటం వెనుక శివాజీ హస్తముందని సత్య వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు ఐదుగురిపై నమోదు కాగా వారిలో ముగ్గురు దామచర్ల సత్య కుటుంబానికి అత్యంత సన్నిహితులని విశ్వసనీయ సమాచారం. కొండపి నియోజకవర్గంలో డోలా, సత్య వర్గాలుగా టీడీపీ సానుభూతిపరులు విడిపోయారని, రానున్న రోజుల్లో వీరి మధ్య ఆధిపత్య పోరు గ్రామస్తులకు, అధికారులకు తలనొప్పిగా మారే అవకాశముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కె.బిట్రగుంటలో ఒకరిపై ఒకరు దాడులు మంత్రి డోలా వర్సెస్, మారిటైం బోర్డు చైర్మన్ సత్య వర్గాలుగా విడిపోయిన టీడీపీ వర్గీయులు గాయపడ్డ ఇద్దరిలో ఒకరు కొండపికి, మరొకరు రిమ్స్కు తరలింపు కె.బిట్రగుంటలో రెండు వర్గాల మధ్య ముదిరిన వివాదం

టీడీపీ వర్గీయుల బాహాబాహీ..