
ముగిసిన పోస్టుమార్టం
కొమరోలు: మండలంలోని తాటిచెర్లమోటు సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలతో బయటపడిన విషయం తెలిసిందే. బాపట్ల జిల్లా స్టూవర్టుపురం గ్రామానికి చెందిన గజ్జల అంకాలు (40), గజ్జల భవాని (25), గజ్జల నరసింహులు (20), గజ్జల జనార్దన్ (30), బొచ్చు సన్ని (30), కర్రెద్దుల దివాకర్ (30) మృతి చెందగా మృతదేహాలను పోస్టుమార్టం కోసం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న మృతుల బంధువులు స్టూవర్టుపురం నుంచి గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం వైద్యులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం ఆరు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఓ ప్రైవేట్ అంబులెన్స్లో మృతదేహాలను స్టూవర్టుపురానికి తరలించారు.
చిన్నారులకు మెరుగైన వైద్యం
ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మృతి చెందిన వారితో పాటు జీతన్, శిరీషలు ఆ కారులోనే ప్రయాణిస్తున్నారు. గాయపడిన వీరికి గిద్దలూరు వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు వైద్యశాలకు తరలించినట్లు స్థానిక ఎస్సై నాగరాజు తెలిపారు.
మృతదేహాలు బంధువులకు అప్పగింత స్వగ్రామానికి ప్రైవేట్ వాహనంలో తరలింపు