
బురదలో కూరుకుని బాలుడి మృతి
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని లుంబేసు పంచాయతీ మూలజమ్ము గ్రామంలో బురదలో కూరుకుపోయి ఓ బాలుడు మృతిచెందాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బిడ్డిక చిరంజీవి, నీరజల కుమారుడు అశోక్ (7) స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని చెరువులో ఆడుకునేందుకు శుక్రవారం వెళ్లాడు. కాసేపు చెరువులో ఉన్న నీటిలో ఆడుకున్నారు. అంతలో ఇంకొంచెం చెరువు మధ్యలోకి వెళ్లిన అశోక్ బురదలో కూరుకుపోయాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో స్నేహితులు హుటాహుటిన గ్రామానికి వెళ్లి కుటుంబసభ్యులకు తెలియజేయడంతో అంతా వచ్చి చెరువులో వెదికారు. చాలా సేపటి తర్వాత బురదలో కూరుకుపోయిన అశోక్ శవమై కనిపించాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.