
‘కూటమి’ విష సంస్కృతి
● వైఎస్సార్ సీపీ సానుభూతి పరులపై వేఽధింపులు ● నూతన విద్యుత్ స్తంభాలు నిలిపివేత ● గ్రామంలో కూటమి నాయకులకే వత్తాసు పలుకుతున్న విద్యుత్ అధికారులు
జె.పంగులూరు: నిన్నటి వరకు కలిసి మెలిసి ఒకే కుటుంబంలా జీవించే గ్రామాలు నేడు రాజకీయ రంగు పులుము కుంటున్నాయి. కులమతాలకు, రాజకీయాలుకు అతీతంగా ఉండే గ్రామాలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో.. రెడ్ బుక్ రాజ్యాంగంలో చితికిపోతున్నాయి. కూటమి పెద్దలు వైఎస్సార్ సీపీ సానుభూతి పరులపై రాజకీయ కక్ష పెంచుకొని, వారిని అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
మండల పరిధిలోని చందలూరు గ్రామ పంచాయతీ పరిధిలోని 8వ వార్డులో గొట్టిపాటి వారి బజారు ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆ వార్డు నుంచి కుంచాల రమాదేవి అనే మహిళ వార్డు మెంబరుగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరురాలిగా గెలిచింది. అయితే గొట్టిపాటి వారి బజారు నుంచి వార్డు మెంబరుగా నిలబడి గెలవడమే ఆ బజారు వారు చేసిన తప్పుగా మారింది. 2024 లో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వారిని అన్ని విధాలుగా ఇబ్బందులు గురిచేస్తున్నారు.
40 ఏళ్ల నాటి కరెంటు స్తంభాలు
గొట్టిపాటి వారి బజారుకి 1984లో మూడు స్తంభాలు వేసి కరెంటు లైన్ లాగారు. అయితే ప్రస్తుతం చందలూరు గ్రామంలో పాత స్తంభాల స్థానంలో కొత్తవి వేస్తున్నారు. అందరితో పాటు తమకూ వేస్తారులే అని అ బజారు వారు అనుకున్నారు. కానీ ఊరు మొత్తం కొత్త స్తంభాలు వేసి కరెంటు లైన్లు లాగిన సిబ్బంది.. ఆ బజారును మాత్రం అలానే వదిలేశారు. 40 సంవత్సరాల నాటి స్తంభాలు పూర్తిగా వంగి పోయి కరెంటు వైర్లు కిందికి జారాయి. ఎప్పడు విరిగిపోతాయో తెలియని దుస్థితి నెలకొంది. అధికారులు మాత్రం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటానికే నిర్ణయించుకున్నట్లుంది.
కలెక్టర్కు అర్జీ
గొట్టిపాటి వారి బజారుకు చెందిన స్థానికులు ఏప్రిల్ 7న బాపట్ల కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన కలెక్టర్ వెంటనే 15 రోజుల్లో సమస్య పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కొత్త స్తంభాలు వేస్తామని, అడ్డు వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి సంతకాలు చేయించుకొని.. ఆన్లైన్లో అర్జీ రద్దు చేశారు. చేసేది లేక తిరిగి గొట్టిపాటి బజరు వారు మే 19న కలెక్టర్కు మరో సారి అర్జీ ఇచ్చారు. కలెక్టర్ సమస్య పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉచిత సలహాలు ఇస్తున్న అధికారులు
విద్యుత్ ఏఈ గొరంట్ల అనిల్ కుమార్కు ఫోన్ చేసి తీగలు వేల్లాడుతున్నాయని చెబితే.. కర్రలు అడ్డు పెట్టుకోమని తమకు ఉచిత సలహాలు ఇస్తున్నారని స్థానికులు వాపోయారు. స్తంభాలు ధ్వంసం అయ్యాయని తెలిపినా.. వాటి జోలికి వస్తే ఊరుకోమంటూ దురుసుగా మాట్లాడారని తెలిపారు.

‘కూటమి’ విష సంస్కృతి