
ఆధునిక వ్యవసాయ విధానంతో అధిక దిగుబడులు
కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వర్లు
పెదకూరపాడు: ఆధునిక వ్యవసాయ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వర్లు చెప్పారు. కృషి విజ్ఞాన్ కేంద్రం వారి ఆధ్వర్యంలో వికసిత్ కృషి సంకల్ప యాత్ర పెదకూరపాడులో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు అంటే డ్రోన్ల ప్రాముఖ్యత, అధునాతన యంత్రాలు గురించి వివరించారు. అవి ఎలా ఉపయోగపడతాయో తెలియ చేశారు. కృషి విజ్ఞాన కేంద్రం లాంఫాం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.గంగాదేవి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయం, అనుబంధ రంగాల పథకాల గురించి వివరించారు. ఈనామ్ పోర్టల్ వినియోగం, కిసాన్ సారధి టోల్ ప్రీనెంబరు గురించి వివరించారు. ఉద్యానశాఖలో అమలవుతున్న పండ్ల తోటలు, పూల తోటలకు ఇచ్చే సబ్సిడీల వివరాలను ఉద్యానవన శాఖాధికారి యు.శ్రీ నిత్య వివరించారు. పశు సంవర్థకశాఖ పథకాలను గురించి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పి.శ్రీదేవి తెలియచేశారు. వ్యవసాయ శాఖలో అమలవుతున్న పీఎం కిసాన్ మట్టి నమూనాల సేకరణ, 50 శాతం రాయితీపై పచ్చిరొట్టె విత్తనాలు పంపిణీ, వ్యవసాయ యాంత్రీకరణ మొదలైన పథకాల గురించి ఏవో ఐ శాంతి తెలియచేశారు. జీవ శిలీంద్రనాసిని అయిన ట్రైకోడెర్మావిరిడి ప్యాకెట్లను కృషి విజ్ఞాన కేంద్రం, లాంఫాం శాస్త్రవేత్తలు రైతులకు ఉచితంగా పంపిణి చేశారు. కార్యక్రమంలో రైతులు, గ్రామ వ్యవసాయ సహాయకులు బి.జ్యోతి, పి.ధనలక్ష్మీ షేక్ హసన్ బాజీ పాల్గొన్నారు.