
పర్యావరణ సమతుల్యతకు మొక్కలు నాటాలి
అదనపు సీనియర్ సివిల్ న్యాయాధికారి ఎం. లావణ్య
నరసరావుపేట టౌన్: పర్యావరణ సమతుల్యం కోసం మొక్కలు నాటాలని అదనపు సీనియర్ సివిల్ న్యాయాధికారి ఎం. లావణ్య సూచించారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా గురువారం రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు స్థానిక న్యాయస్థానం ఆవరణలో పర్యావరణ పరిరక్షణపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని ప్రసంగించారు. మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలనీ, కాలుష్యాన్ని నివారించడం కోసం అందరమూ కృషి చేయాలన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి సంరక్షించడంతోపాటు ప్లాస్టిక్ బ్యాగ్ల వాడకాన్ని నివారించాలన్నారు. అనంతరం న్యాయస్థాన భవనాల ఆవరణలో న్యాయాధికారి లావణ్య మొక్కలు నాటారు. కార్యక్రమంలో పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, కోర్ట్ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఐ ఎం.వి. చరణ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ లోక్నాథ్, ఎస్ఐలు కిషోర్, అశోక్ సిబ్బంది పాల్గొన్నారు.