
మూడు వాహనాలు ఢీ.. ఒకరు మృతి
రొంపిచర్ల: మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన రొంపిచర్ల సమీపంలోని శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్వేపై బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సు కందుకూరుకు వెళ్తోంది. రొంపిచర్ల విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలోకి రాగానే బస్సు ఆగటంతో 8 మంది ప్రయాణికులు దిగారు. అదే సమయంలో వెనుకగా వస్తున్న కంటైనర్ లారీ అదుపు తప్పి ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సు రోడ్డు మార్జిన్కు దూసుకు రాగా, ఢీకొట్టిన లారీ రోడ్డుపైనే నిలబడింది. ఇంతలో అదే రూట్లో వస్తున్న ప్రయివేటు ట్రావెల్ బస్సు అదుపుతప్పి కంటైనర్ లారీని ఢీకొంది. కంటైనర్ లారీ ముందు భాగంలో నిల్చొని ఉన్న ప్రయాణికుడు బెల్లంకొండ మాధవరావు(40)పై నుంచి లారీ వెళ్లింది. మాధవరావు అక్కడికక్కడే మృతి చెందాడు. అతనిది ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం పరిధిలోని గుడ్లూరి మండలం, మిట్టపాలెం గ్రామం అని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సులు, లారీకి నష్టం వాటిల్లింది. వెంటనే ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్ సహాయంతో పోలీసులు తొలగించారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న నరసరావుపేట రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్ఐ సీహెచ్ మణికృష్ణలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.