
మట్టి దొంగలపై చర్యలు తీసుకోవాలి
పీజీఆర్ఎస్లో కలెక్టర్ను కోరిన మునుమాక గ్రామస్తులు
నరసరావుపేట: మూడు గ్రామాల్లోని వందల ఎకరాలకు సాగునీటి కోసం నిర్మించిన చెక్ డ్యామ్ చుట్టూ వేసిన మట్టి కట్టలను అక్రమంగా తరలించుకుపోతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మునుమాక గ్రామస్తులు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబును కోరారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో సయ్యద్ కరిముల్లా, అన్వర్బాషా, జిలాని, షాజహాన్, జాన్సైదా, మస్తాన్వలితో పాటు పలువురు గ్రామస్తులు కలెక్టర్ను కలిసి అర్జీ అందజేశారు. కోటప్పకొండకు సమీప గ్రామాలైన కొండకావూరు, అరవపల్లి, మునుమాక గ్రామాల్లోని పొలాలకు అవసరమైన సాగునీటి కోసం మునుమాక వద్ద ఓగేరు వాగుపై చెక్డ్యామ్ నిర్మించారని తెలిపారు. ఈ గ్రామాలకు చెందిన పొలాలు కాలువ చివరి భూములు కావడంతో డ్యామ్ అవసరమైందని చెప్పారు. ఇటీవల కొందరు మట్టి దొంగలు డ్యామ్కు రక్షణగా ఉన్న మట్టికట్టలను తవ్వి తరలించుకుపోతున్నారని కలెక్టర్కు తెలిపారు. దీని వల్ల డ్యామ్కు రక్షణ లేకుండా పోయిందని, వరదల సమయంలో కొట్టుకొనిపోయే ప్రమాదం పొంచి ఉందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో పాటు పంట భూములు కోతకు గురయ్యే అవకాశం కూడా ఉందని, వందల ఎకరాలు బీడు భూములుగా మారి రైతులు జీవనోపాధి కోల్పోతారని తెలిపారు. అక్రమ మట్టి తరలింపును అరికట్టి చెక్డ్యామ్ను కాపాడాలని గ్రామస్తులు కోరారు.