
కక్షకట్టి రోడ్డున పడేశారు..!
● దౌర్జన్యంగా ఫుట్పాత్ దుకాణం సామాన్లు పడేసిన పంచాయతీ సిబ్బంది
● వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండటమే కారణం
టెక్కలి: కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. పేద, సామాన్య వర్గాలు, దళితులు వ్యాపారాలు చేసుకునే ఫుట్పాత్ దుకాణాలనూ వదలడం లేదు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారనే శుక్రవారం కోటబొమ్మాళి మెయిన్రోడ్లో ఓ ఫుట్పాత్ దుకాణాన్ని తొలగించి ఆ కుటుంబాన్ని నడిరోడ్డున పడేశారు. వివరాల్లోకి వెళితే..ప్రకాశ్నగర్ కాలనీకు చెందిన బచ్చు సంధ్య స్థానిక పాఠశాలకు ఎదురుగా ఓ టీ దుకాణం నిర్వహిస్తోంది. సుమారు 25 ఏళ్లుగా కుటుంబాన్ని పోషిస్తోంది. ఈమె వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండటంతో స్థానిక టీడీపీ నాయకులు కక్ష కట్టారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్న ఫుట్పాత్ దుకాణాన్ని తొలగించేందుకు పంచాయతీ ఈఓ చింతాడ శ్రీనివాసరావు, సహాయకుడు సన్యాసిరావు, పోలీస్ సిబ్బందిని ఉసిగొల్పారు. వారు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఫుట్పాత్ దుకాణంలో సామాన్లు నడిరోడ్డున పడేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. పాతికేళ్లుగా ఎవరికీ ఇబ్బందులు లేకుండా చిన్నపాటి దుకాణాన్ని నిర్వహిస్తున్న తన కుటుంబాన్ని ఈ విధంగా నడిరోడ్డున పడేయడం తగదంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కోటబొమ్మాళిలో ఎంతో మంది ఫుట్పాత్ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, కేవలం తనపై మాత్రమే కక్ష కట్టారంటూ వాపోయింది. దివ్యాంగుడైన తన భర్తతో పాటు ఇద్దరు పిల్లల్ని పోషిస్తున్న తనపై ఈ విధంగా కుట్ర చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై పంచాయతీ సర్పంచ్ సంజీవరావు సైతం అధికారులకు చెప్పినా పట్టించుకోకుండా తొలగించారని వాపోయింది.